సిగ్నల్‌ లోపం వల్లే...!

4 Jun, 2023 05:22 IST|Sakshi

కోరమండల్‌ ట్రాక్‌పై రెడ్‌సిగ్నల్‌

అందుకే ట్రాక్‌ మారి లూప్‌ లైన్లోకి

సిగ్నల్‌ సమస్యే ప్రమాదానికి ప్రధాన కారణమని రైల్వే శాఖ సంయుక్త తనిఖీ కమిటీ తేల్చింది. ‘‘కోరమండల్‌ మొదటి మెయిన్‌ లైన్లోంచి లూప్‌ లైన్లోకి మారి దానిపై గూడ్సును ఢీకొట్టి పట్టాలు తప్పింది. దాని బోగీలు చెల్లాచెదురయ్యాయి. కొన్ని వెళ్లి రెండు మెయిన్‌ లైన్లపై పడ్డాయి. అదే సమయంలో రెండో మెయిన్‌ లైన్‌పై బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ ఆ బోగీలను ఢీకొని పట్టాలు తప్పింది. రెండు బోగీలు పట్టాలు తప్పి తలకిందులయ్యాయి’’ అని ప్రాథమిక నివేదికలో స్పష్టం చేసింది. అందులో ఇంకా ఏముందంటే...

► సాయంత్రం 6.52 గంటల సమయంలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బహనగా స్టేషన్‌ను దాటుతుండగా ప్రమాదం జరిగింది.
► ఈ స్టేషన్‌ వద్ద రెండు మెయిన్‌ లైన్లతో పాటు వాటికిరువైపులా రెండు లూప్‌ లైన్లున్నాయి.
► పాసింజర్‌ హాల్ట్‌ స్టేషన్‌ గనుక ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు వచ్చినప్పుడు గూడ్స్‌లను లూప్‌ లైన్లకు తరలిస్తారు.
► శుక్రవారం సాయంత్రం ఒక గూడ్స్‌ ముందుగా స్టేషన్‌ సమీపానికి చేరుకుంది. వెనకే కోరమండల్‌ వస్తుండటంతో గూడ్స్‌ను లూప్‌లైన్‌కు మళ్లించారు.
► కోరమండల్‌ వెళ్లాల్సిన మెయిన్‌ లైన్‌పై అప్పటికి రెడ్‌ సిగ్నల్‌ ఉంది. స్టేషన్‌ సిబ్బంది 17ఏ స్విచ్‌ నొక్కి దాన్ని గ్రీన్‌గా మార్చాలి. కానీ ఆ స్విచ్‌ను నొక్కినా పని చేయలేదు (సిగ్నల్‌ ఇచ్చి, మళ్లీ వెనక్కు తీసుకున్నారని కూడా చెబుతున్నారు). రెడ్‌ సిగ్నలే కొనసాగడంతో కోరమండల్‌ లూప్‌లైన్‌లోకి మళ్లి గూడ్స్‌ను ఢీకొట్టింది.
► గూడ్స్‌ని బలంగా ఢీకొట్టిన తర్వాత కోరమండల్‌ కోచ్‌లు ఎగిరిపడి.. పక్కన ఉన్న మరో మెయిన్‌లైన్‌పైకి వెళ్లాయి.
► అదే సమయంలో ఆ లైన్‌లో 130 కి.మీ. వేగంతో (116 కి.మీ. అని కూడా చెప్తున్నారు) వెళ్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్‌ చివరి బోగీలపై కోరమండల్‌ బోగీలు పడ్డాయి. దాంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
► హౌరా 3 నుంచి 5 సెకెన్ల ముందుగా వచ్చుంటే ప్రమాదం తప్పేది.
► సూపర్‌ ఫాస్ట్‌ రైళ్ల గరిష్ట వేగం 130 కి.మీ.
► ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు