జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

18 Dec, 2020 13:57 IST|Sakshi

జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ ఆదేశాలు, విచారణను తప్పు పట్టిన అత్యున్నత న్యాయస్థానం

ఏపీ హైకోర్టు ఆదేశాలు నిలిపివేస్తూ.. ఉత్తర్వులు జారీ

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ‘రాజ్యాంగ సంక్షోభం’ అంశం విచారణలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. ప్రభుత్వ ఎస్‌ఎల్‌పీ పిటిషన్‌ని విచారించిన కోర్టు.. దీనితో ముడిపడి ఉన్న ఇతర పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను నిలిపి వేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాక హైకోర్టు జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌, జస్టిస్‌ ఉమాదేవి బెంచ్‌ ఆదేశాలు, విచారణను కోర్టు తప్పుపట్టింది. హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయంటూ అత్యున్నత న్యాయస్థానం​ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదని సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఎస్‌ బోబ్డే స్పష్టం చేశారు. 

ఇక రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ని వ్యతిరేకించిన న్యాయవాది సిద్దార్థ లూథ్రాపై సుప్రీంకోర్టు మండిపడింది. ‘మీరు ఎన్నాళ్ల నుంచి ప్రాక్టీసు చేస్తున్నారు.. గతంలో ఇలాంటి ఆదేశాలు ఎప్పుడైనా ఇచ్చారా’ అంటూ కోర్టు సిద్దార్థ లూథ్రాను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో కనీసం హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై విచారణకు అనుమతించాలన్న సిద్దార్థ లూథ్రా అభ్యర్థనని కోర్టు తిరస్కరించింది. రాజ్యంగం సంక్షోభంలో ఉందనే భావనతో జడ్జి ప్రభావితం అయినందున అన్ని విచారణలపైన స్టే విధిస్తున్నామని సుప్రీంకోర్టు వెల్లడించింది. సెలవుల తర్వాత తదుపరి విచారణ చేస్తామని తెలిపింది. (చదవండి: ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరపాల్సిందే)

మరిన్ని వార్తలు