Christmas Celebrations: హిమాచల్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

25 Dec, 2023 20:03 IST|Sakshi

సిమ్లా: క్రిస్మస్ వేడుకల సందర్భంగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని లాహౌల్, స్పితికి భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మనాలి-రోహ్‌తంగ్ హైవేపై అటల్ టన్నెల్ వైపు వెళ్లే మార్గాలు కార్లతో నిండిపోయాయి. పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో పోలీసులు డ్రోన్‌తో నిఘా పెట్టారు. 

సరిపడా పార్కింగ్ సౌకర్యాలు లేకపోవటం, వాహనాల రద్దీకి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో చాలా మంది పర్యాటకులు పార్కింగ్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. అధికారులు తాత్కాలిక ఏర్పాట్లతో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

నదిలో ప్రయాణం..

ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడటానికి ఓ వ్యక్తి లాహౌల్‌లో రోడ్డు మార్గం కాకుండా నది గుండా కారులో ప్రయాణించాడు. ఇలాంటి ప్రమాదకర ప్రయాణం చేయరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  

సిమ్లా నగరంలోని హోటళ్లు కిక్కిరిసిపోయాయని ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ పాల్ తెలిపారు. శనివారం నుండి సోమవారం వరకు సెలవులు రావడంతో ఈ ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి పెరిగింది. ధర్మశాల, సిమ్లా, నర్కండ, మనాలి, డల్హౌసీ తదితర ప్రాంతాలతో పాటు హిమాచల్‌లో క్రిస్మస్‌ వేడుకలు చేసుకునేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సిమ్లా పోలీసులు నగరంలో వాహనాల ప్రవేశ డేటాను విడుదల చేశారు దీని ప్రకారం గత 72 గంటల్లో సిమ్లాకు 55,345 వాహనాలు వచ్చాయి. ఈ సంఖ్య  అంతకంతకూ పెరుగుతోంది.

ఇదీ చదవండి: యేసుక్రీస్తు బోధనలు దేశాభివృద్ధికి మార్గనిర్దేశం: ప్రధాని మోదీ

>
మరిన్ని వార్తలు