సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న జానపద నృత్యకారిణి మంజమ్మ జోగతి. పద్మశ్రీ పొందిన తొలి ట్రాన్స్విమెన్. కేవలం జోగప్పలకు పరిమితమైన జోగతి నృత్యాన్ని మరింత విస్తరించాలనేది ఆమె కల. ఈ నేపథ్యంలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగానే ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు మంజమ్మ.
పదిహేనేళ్లు ఉన్నప్పుడు ట్రాన్స్జెండర్గా కుటుంబానికి దూరమయ్యారు. ఇంటినుంచి బైటపడి బతుకుదెరువు కోసం వీధుల్లో భిక్షాటన చేయడమే కాదు, ఆమె పలుమార్లు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఒకానొక దశలో విషం తాగి చచ్చిపోవాలకుని ఆత్మహత్యాయత్నం చేశారు. కానీ ప్రాణాలతో బయటపడ్డారు. అయినా 20 మంది తోబుట్టువులతో సహా ఆమె కుటుంబ సభ్యులెవరూ తనను పలకరించేందుకు ఆసుపత్రికి రాలేదని ఆమె వాపోయారు. ఈ అవార్డు ద్వారా, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ హక్కులను గుర్తించి వారికి విద్య, ఉద్యోగాలు అందించేలా ప్రభుత్వాలు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యం చేయకుండా, మూలకు విసిరి వేయకుండా తనలాంటి ట్రాన్స్జెండర్ పిల్లలను ఆదరించాలని ఆమె ఉద్వేగ భరితంగా చెప్పుకొచ్చారు.
మంజమ్మ అసలు పేరు మంజునాథ్ శెట్టి. 1964 ఏప్రిల్ 18న బళ్లారి, కల్లుకాంబ గ్రామంలో హనుమంతయ్య, జయలక్ష్మి దంపతులకు జన్మించిన మంజునాథ్ అలియాస్ మాత మంజమ్మ జోగతి జీవిత విశేషాలపై ఆసక్తికర వీడియో మీకోసం..