Indian Pilots Die: రెండ్రోజుల్లో ఇద్దరు పైలట్లు మృతి.. ఎందుకిలా జరుగుతోంది?

17 Aug, 2023 16:16 IST|Sakshi

న్యూఢిల్లీ: మియామి నుండి చిలీ ప్రయాణిస్తున్న విమానంలో పైలెట్  బాత్రూమ్‌లో కుప్పకూలి మృతి చెందిన సంఘటన మరువక ముందే రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ పైలట్లు రెండు వేర్వేరు సంఘటనల్లో మృతి చెందారు. ఈ విషయాన్ని సివిల్ ఏవియేషన్ శాఖ డైరెక్టరేట్ జనరల్ ధృవీకరించారు. 

మృతి చెందినవారిలో ఒకరు ఇండిగో ఎయిర్ లైన్స్ కెప్టెన్ కాగా మరో పైలట్ ఖతార్ ఎయిర్ లైన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇండిగో కెప్టెన్ ఈరోజు నాగ్‌పూర్ నుండి పూణే విమాన సర్వీసు నడిపించాల్సి ఉండగా నాగ్‌పూర్ బోర్డింగ్ గేటు వద్దే స్పృహ కోల్పోయి పడిపోయారు. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధృవీకరించాయి ఆసుపత్రి వర్గాలు. 

ఈయన రెండు సెక్టార్లు ఆపరేట్ చేశారని ఉదయం 3 గంటల నుండి 7 గంటల వరకు ట్రివేండ్రం నుండి పూణే మీదుగా నాగ్‌పూర్ చేరుకున్నారని అనంతరం 27 గంటల విరామం తర్వాత ఈరోజు నాలుగు సెక్టార్లు ఆపరేట్ చేయాల్సి ఉందని సివిల్ ఏవియేషన్ శాఖ వెల్లడించింది. కానీ అంతలోనే ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు నాగ్‌పూర్ విమానాశ్రయంలోని బోర్డింగ్ గేటు వద్ద కుప్పకూలి మృతి చెందారు.      

ఖతార్ ఎయిర్ లైన్స్ పైలట్ మాత్రం నిన్న అదనపు సిబ్బందిగా ఢిల్లీ దోహా ఫ్లైట్‌లో పాసింజర్ క్యాబిన్ లో ప్రయాణిస్తుండగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. అంతకు ముందు ఈయన స్పైస్ జెట్, అలయన్స్ ఎయిర్, సహారా ఎయిర్ లైన్స్ కు పనిచేశారు. ఇలా వరుస రోజుల్లో పైలట్లు గుండెపోటుతో మృతి చెందడంతో సివిల్ ఏవియేషన్ వారు ఆందోళనకు గురవుతున్నారు.            

ఇది కూడా చదవండి: మానవమృగం.. శిక్ష అనుభవించినా బుద్ధి మారలేదు.. 

మరిన్ని వార్తలు