బర్త్‌డే నాడు గొర్రెలతో ధర్నా.. గవర్నర్‌ మనస్తాపం

19 May, 2021 21:20 IST|Sakshi
గవర్నర్‌ నివాసం రాజ్‌భవన్‌ ఎదుట గొర్రెలు

కలకత్తా: పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ వాతావరణం వేడెక్కింది. నారద స్టింగ్‌ ఆపరేషన్‌లో ఇద్దరు మంత్రులు ఓ ఎమ్మెల్యే, ఓ నాయకుడిని సీబీఐ అరెస్ట్‌ చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్‌ తీరుపై తీరొక్క నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గురువారం ఆయన జన్మదినం రోజు కూడా నిరసన ప్రదర్శనలు చేయడంతో ఆయన మనస్తాపం చెందారు.

తాజాగా గవర్నర్‌ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ గుర్తు తెలియని వ్యక్తులు రాజ్‌భవన్‌ ఎదుట గొర్రెలతో నిరసన వ్యక్తం చేశారు. గొర్రెలను తీసుకొచ్చి రాజ్‌భవన్‌ ఉత్తర ద్వారం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. కొద్దిసేపు అనంతరం భద్రతా సిబ్బంది గొర్రెలను వెళ్లగొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను గవర్నర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు.

ఈ ఘటనపై గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న, ఈరోజు పరిస్థితి ఆందోళనగా మారిందని గవర్నర్‌ తెలిపారు. కలకత్తా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం రెచ్చగట్టే చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. నిన్న ఒకరు గవర్నర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే కూడా పోలీసులు ఏం చేయడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ లేఖ విడుదల చేశారు.
 

మరిన్ని వార్తలు