రిహన్నా ట్వీట్‌.. గూగుల్‌లో ఏం సెర్చ్‌ చేశారంటే?

4 Feb, 2021 15:57 IST|Sakshi

రైతుల నిరసనలపై స్పందించిన్పటి నుంచి ప్రముఖ పాప్‌ సింగర్‌ రిహన్నా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ టాపిక్‌గా మారారు. ప్రపంచ గాయని, నటి రిహన్నా భారత్‌లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు తెలుపుతున్న రైతులకు మద్దతుగా మంగళవారం ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. "మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకోకూడదు?" అంటూ ఫార్మర్స్ ప్రొటెస్ట్ హ్యాష్ ట్యాగ్‌ను, ఓ మీడియాలో ప్రచురితమైన వార్తను జోడిస్తూ పోస్ట్ పెట్టారు. ఇక ఈ ట్వీట్‌ చేయడంతో రిహన్నా వైరల్‌గా మారారు. ఆమె ట్వీట్ చాలా సేపు ట్విట్టర్‌లో ట్రెండ్ అయ్యింది. కొంతమంది ఆమెకు మద్దతు తెలిపితే.. పూర్తి స్థాయి అవగాహన తర్వాత స్పందించాలని మరికొంతమంది హితవు పలికారు. చదవండి: కంగనాకు ట్విటర్‌ మరోసారి షాక్‌

ఇదిలా ఉండగా అన్నదాతల ఆందోళనలపై స్పందించడంతో రిహాన్నా గూగుల్‌లోనూ ట్రెండింగ్‌ మారారు. ఈ గాయని గురించి అనేకమంది నెటిజన్లు మొదటిసారి వినడంతో తన గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతతో గూగుల్‌లో సెర్చ్‌ చేయడం ప్రారంభించారు. రిహన్నా ఎవరనే విషయంతోపాటు ఆమె మతం ఏంటని ఎక్కువగా శోధించారు. రిహన్నా పాకిస్తానీనా? ముస్లిమా కాదా అన్న విషయాన్ని ఎక్కువగా సెర్చ్‌ చేశారు. రిహన్నాతో పాటు, రైతుల నిరసనల గురించి ట్వీట్ చేసిన అనేక ఇతర అంతర్జాతీయ వ్యక్తులు గ్రేటా థన్‌బెర్గ్, హసన్ మిన్హాజ్, లిల్లీ సింగ్, జాన్ కుసాక్, అమండా సెర్నీ, మియా ఖలీఫా గురించి సెర్చ్‌ చేశారు. చదవండి: సెలబ్రిటీలపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా మాజీ అడల్ట్ స్టార్ మియా ఖలీఫా, ప్ర‌ముఖ పాప్ సింగ‌ర్ రిహానా, యాక్టివిస్ట్ గ్రెటా థ‌న్‌బ‌ర్గ్‌, అమెరికా ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారిస్ మేన‌కోడ‌లు, లాయ‌ర్ మీనా హారిస్ సహా పలువురు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే భారత్‌లో విభజన సృష్టించేందుకు కొందరు బయటి వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని బాలీవుడ్‌ స్టార్లు అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, కరణ్‌ జోహార్‌, కంగనా రనౌత్‌, దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌, విరాట్‌, అనిల్‌ కుంబ్లే తదితరులు పిలుపునిచ్చారు. అంతేగాక రిహానా చేసిన ట్వీట్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘాటుగా కౌంటరిచ్చారు. భారతదేశ ఐకమత్యాన్ని ఇలాంటి ప్రచారాలు దెబ్బతీయలేవని..దేశ పురోగతిని అడ్డుకోలేవని అమిత్‌ షా స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు