కొత్త డిజిటల్ నిబంధనలను వ్యతిరేకిస్తున్న వాట్సాప్

26 May, 2021 19:07 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈరోజు(మే 26) నుంచి అమల్లోకి వచ్చిన కొత్త డిజిటల్ నిబంధనలను వ్యతిరేకిస్తూ వాట్సాప్ ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త డిజిటల్ నిబంధనల వల్ల తమ వినియోగదారుల ప్రైవసీ ప్రొటెక్షన్‌ విచ్ఛిన్నం అవుతుందని వాట్సాప్ చెబుతుంది. అందువల్ల కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను ఆపేయాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్ ఢిల్లీ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. తాజా నిబంధనలలో ఒకటి భారత రాజ్యాంగంలోని గోప్యతా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని హైకోర్టుకు తెలిపింది. దీనివల్ల 40 కోట్ల భారతీయ వినియోగదారుల ప్రైవసీకి భంగం కలుగుతుందని పేర్కొంది.

కొత్త నిబంధనల ప్రకారం తాము అడిగినప్పుడు సమాచారాన్ని వెంటనే అందివ్వాలని సోషల్ మీడియా కంపెనీలకు అధికారులు డిమాండ్ చేస్తారని, ఇది గోప్యతా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని వాట్సాప్ ఫిర్యాదులో పేర్కొంది. వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌లోని సందేశాలకు ఎండ్-టు-ఎండ్ భద్రత ఉంటుందని ప్రస్తుత నిబంధనలను పాటించాలంటే ఎండ్-టు-ఎండ్ భద్రతను విచ్ఛిన్నం చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నిబంధనలలో మొదట ఎవరు ఫేక్ న్యూస్/తప్పుడు వార్తలను ప్రచారం చేశారో గుర్తించి ప్రభుత్వానికి తెలియజేయాలి. అందుకే వాట్సాప్ నిబంధనలను వ్యతిరేకిస్తుంది. సోషల్ మీడియా కంపెనీలు అమలు చేయాల్సిన కొత్త నిబంధనల గురుంచి కేంద్రం మూడు నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసింది.

చదవండి: స్వదేశీ ట్విటర్ "కూ" యాప్ లో భారీగా పెట్టుబడులు

మరిన్ని వార్తలు