జనాభాను నియంత్రించలేం

9 Jan, 2023 05:32 IST|Sakshi

బిహార్‌లో స్త్రీలు నిరక్షరాస్యులు

పురుషుల్లో నిర్లక్ష్యం ఎక్కువ: నితీశ్‌

పాట్నా:  జనాభా పెరుగుదలను అరికట్టే విషయంలో బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమ రాష్ట్రంలో స్త్రీలు నిరక్షరాస్యులని, పురుషుల్లో నిర్లక్ష్యం ఎక్కువని, అందుకే జనాభా పెరుగుదలను నియంత్రించలేమని తేల్చిచెప్పారు. సమాధాన్‌ యాత్రలో భాగంగా ఆయన ఆదివారం వైశాలీలో బహిరంగ సభలో ప్రసంగించారు. మహిళలు చదువుకుంటే జనాభా తగ్గుతుందని, ఇదే వాస్తవమని అన్నారు.

గర్భం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అక్షరాస్యులైన మహిళలకు తెలుస్తుందని వెల్లడించారు. జనాభా నియంత్రణపై పురుషులు సైతం దృష్టి పెట్టడం లేదని ఆక్షేపించారు. ఎక్కువ మంది పిల్లలను కనొద్దన్న ఆలోచన వారిలో ఉండడం లేదన్నారు. నితీశ్‌ కుమార్‌ వ్యాఖ్యలను ప్రతిపక్ష బీజేపీ నేత సామ్రాట్‌ చౌదరి తప్పుపపట్టారు. బిహార్‌ ప్రతిష్టను దెబ్బతీసేలా నితీశ్‌ మాట్లాడారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు