గన్నవరం: నూర్ బాషాలకు ప్రాధాన్యం, గుర్తింపు ఇచ్చింది వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం మాత్రమేనని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓతూరి రసూల్ పేర్కొన్నారు. గన్నవరం మండలంలోని దావాజీగూడెంలో ఆదివారం నూర్ బాషా, దూదేకుల ముస్లిం, మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రసూల్ మాట్లాడుతూ గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా నూర్ బాషాల సంక్షేమానికి ఫెడరేషన్ను స్థాపించారని గుర్తు చేశారు. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నూర్ బాషాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరింత చేయూత అందిస్తున్నారని కొనియాడారు. టీడీపీ హయాంలో ముస్లిం, మైనార్టీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. నూర్ బాషాలను ఎస్సీ జాబితాల్లో చేర్చే విషయమై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆ సంఘ అధికార ప్రతినిధి గాజుల బాజి కోరారు. అనంతరం సంఘం కృష్ణా జిల్లా నూతన అధ్యక్షుడిగా పులిమద్ది చిన్నమస్తాన్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా పీరాబీని నియమిస్తూ ఉత్తర్వులను రసూల్ అందజేశారు. సంఘం కార్యనిర్వహణ కార్యదర్శి ఎంబీఏ నాగూర్బాబు, నూర్ బాషాల ట్రస్ట్ చైర్మన్ షేక్ సైదులు, సీఐటీయూ నాయకుడు బడుగు మరియదాసు, మసీదు కమిటీ అధ్యక్షుడు కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.