భువనేశ్వర్: పూరీ జగన్నాథ ఆలయం వారసత్వ ప్రాకార ప్రాజెక్టు పనులు తుది దశకు చేరాయి. వచ్చే ఏడాది జనవరి 17న భక్తులకు అంకితం చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కార్యాచరణ తుది మెరుగులు దిద్దుకుంలోంది. గుండిచా నుంచి శ్రీమందిరం వరకు దాదాపు 3 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన బొడొ దండొ (గ్రాండ్ రోడ్డు) దారి పొడవునా ఇరువైపులా ఉన్న నివాస భవనాలు, హోటళ్లు, దుకాణాలు, కార్యాలయాలు ఇతరేతర నిర్మాణాలు, కట్టడాలకు ఒకే రంగుతో ఏకరీతిలో అలంకరించేందుకు నిర్ణయించారు. వారసత్వ ప్రాకార శోభతో భక్తులకు అంకితం చేయడానికి ముందే ఆయా నిర్మాణాలు, కట్టడాల యజమానులు రంగు వేయడం పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్ధారిత గడువులోగా ఈ పని పూర్తి చేయకుంటే ఆలయ యాజమాన్యం పూర్తి చేస్తుంది. అనుబంధ ఖర్చులను యజమాని నుంచి వసూలు చేస్తుందని స్పష్టం చేయడం విశేషం.
లేత గులాబీ రంగు వేయాలని..
బొడొదండొ పొడవునా ఇరువైపుల ఉన్న కట్టడాలకు లేత గులాబీ రంగు వేయాలని ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనుంది. 5టీ చైర్మన్ వి.కె.పాండియన్ ఇటీవల పూరీని సందర్శించినప్పుడు ప్రతిపాదిత 14 రంగుల నుంచి లేత గులాబీ రంగును ఖరారు చేశారు. స్థానికుల అభీష్టం మేరకు అవసరమైతే వాటిని మార్చుకునేందుకు అనుబంధ వర్గాలకు వెసులుబాటు కల్పిస్తారు. బొడొదండొ వెంబడి ఉన్న అన్ని భవనాల యజమానులు తమ కట్టడాలకు లేత గులాబీ రంగు పూత వేసేందుకు నిర్ధారిత మార్గదర్శకాలు రూపుదిద్దుంకుటున్నాయి. గడువులోగా ఎవరైనా విఫలమైతే పాలనా యంత్రాంగం ఈ పనులు చేపడుతుంది. అయితే భవన యజమానులు మొత్తం ఖర్చును భరిస్తారని పూరీ జిల్లా యంత్రాంగం అధికారి ఒకరు తెలిపారు.
పాత యోచనే
జగన్నాథుని నవ కళేబర ఉత్సవం పురస్కరించుకుని 2015 సంవత్సరంలో బొడొ దండొ పరిసరాల్లో కట్టడాలు, నిర్మాణాలకు దంతపు రంగు పూత పూయించారు. ఈ పూత క్రమంగా పేలబారింది. అనంతరం పూరీ వారసత్వ ప్రాకార ప్రాజెక్ట్ వెలుగు చూసింది. 2016 సంవత్సరంలో తొలిసారిగా ఈ ప్రాజెక్టు రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. యాత్రికుల పట్టణాన్ని అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన వారసత్వ ప్రదేశంగా మార్చే లక్ష్యంతో డిసెంబర్ 2019 సంవత్సరంలో శ్రీమందిరం ప్రాకార ప్రాజెక్టు రూపురేఖలు ఖరారయ్యాయి. రూ.800 కోట్ల ప్రాజెక్ట్లో పట్టణంలోని ప్రధాన ప్రాంతాలను సందర్శకులు మరియు పర్యాటకుల కోసం ఆలయ పరిసర ప్రాంతాలను పునరాభివృద్ధి చేయడంతో మేఘనాథ్ ప్రహరి (దేవస్థానం వెలుపలి గోడ) చుట్టూ అడ్డంకులు లేని 75 మీటర్ల ప్రాకారం అత్యంత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటోంది. ఆలయ సరిహద్దు గోడకు 55 మీటర్ల పరిధిలో అందుబాటులో ఉండే సౌకర్యాల్లో ఆరు మరుగుదొడ్లు మరియు ఆలయానికి దక్షిణం, ఉత్తరం మరియు పడమర దిశలలో మూడు ఆశ్రయ కేంద్రాలు ఉన్నాయి. 6,000 మంది సామర్ధ్యతో శ్రీమందిర్ రిసెప్షన్ సెంటర్, జగన్నాథ్ కల్చరల్ సెంటర్, రఘునందన్ గ్రంథాలయం, బొడొదండొ వారసత్వ వీధి, జగన్నాథ్ వల్లభ్ యాత్రికుల సముదాయం, బహుళస్థాయి కారు పార్కింగ్ మరియు ఇతర సౌకర్యాలు ఉంటాయి.
జనవరి 17న భక్తులకు అంకితం