‘కలెక్షన్‌ ఫుల్‌.. సానుభూతి నిల్‌.. టీడీపీ వసూళ్ల రాజకీయం’

8 Sep, 2022 13:40 IST|Sakshi

మాజీ మంత్రి పేర్ని నాని

సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విషం చిమ్మడమే పనిగా టీడీపీ నేతలు పెట్టుకున్నారని దుయ్యబట్టారు. పేదలకు ప్రభుత్వం స్థలాలు ఇవ్వడం తప్పా? అని ప్రశ్నించారు. రాజధానిలో పేదలు, బడుగులు ఉండకూడదా? బాబు పాలనలో దోచుకుని దాచుకోవడం పనిగా పెట్టుకున్నారు. రాజధాని పేరుతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. పాదయాత్ర అంటూ మళ్లీ డ్రామా మొదలు పెట్టారని పేర్ని నాని నిప్పులు చెరిగారు.
చదవండి: ఆ ఘటనపై చలించిపోయిన సీఎం జగన్‌.. కీలక ఆదేశాలు

పాదయాత్రకు కలెక్షన్‌ ఫుల్‌.. సానుభూతి నిల్‌.. ఉద్యమం పేరుతో వసూళ్ల రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఆహా ఓహో అంటూ గతంలో రాతలు రాసిన ఎల్లో మీడియా.. 600 హామీలిచ్చి నెరవేర్చకపోతే ఎందుకు ప్రశ్నించలేదు అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. 75 శాతం హామీలను మూడేళ్లలోనే జగన్‌ నెరవేర్చారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు వారికి కనిపించవా? అని ప్రశ్నించారు.

‘‘రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది చంద్రబాబు కాదా?. రైతులకు బకాయిలు చెల్లించకుండా ఎగ్గొట్టింది ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులను కూడా గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం.సంక్షేమాన్ని చూడలేక ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారు’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు.
 

మరిన్ని వార్తలు