ఇలాగైతే పార్టీ బతకదు! 

10 Sep, 2020 06:39 IST|Sakshi

కార్యాలయానికి తాళం వేసి చుట్టపుచూపుగా వస్తే ఎలా?

నెలల తరబడి హైదరాబాద్‌లో గడపడం ఏమిటి?

అధినేతతో అయ్యన్న వ్యాఖ్య

సాక్షి, అమరావతి: ‘పార్టీ ఆఫీసుకు తాళం వేసి వెళ్లిపోతే ఎలా? ప్రజలు ఏమనుకుంటారు? కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇస్తున్నాం? ఇలాగైతే పార్టీని ఎవరూ బతికించలేరు’ అని టీడీపీ సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అధినేత చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోనే ఉంటున్న చంద్రబాబు 4 రోజులక్రితం ఉండవల్లి చేరుకుని పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో అయ్యన్నపార్టీ కార్యకలాపాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
  
► చంద్రబాబు హైదరాబాద్‌లోనే ఉండిపోవడం, ఎప్పుడైనా చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోవడం సరికాదని అయ్యన్న్న కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. ప్రజల్లోకి వెళ్లకుండా ఆన్‌లైన్‌ సమావేశాలు, మీడియా హడావుడితో సరిపెడితే పార్టీకి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. కొందరు ప్రచారం కోసం పనిచేస్తున్నారని, వారివల్ల ఉపయోగం లేదని అయ్యన్న పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ కార్యాలయానికి తాళం వేసి అధ్యక్షుడు నెలల తరబడి హైదరాబాద్‌లో గడుపుతుంటే ప్రజలు ఏమనుకుంటారని అయ్యన్న ప్రశ్నించినట్లు సమాచారం.  

► ఇలాగైతే పార్టీని ఎవరూ రక్షించలేరని అయ్యన్న వ్యాఖ్యానించినట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కంగుతిన్న చంద్రబాబు హైదరాబాద్‌ వెళ్లాక లోకేష్‌ని ఏపీకి వెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం.\

చదవండి: రథం చుట్టూ రాజకీయం!

మరిన్ని వార్తలు