అంబేడ్కర్‌కు నివాళి అర్పించే తీరిక కేసీఆర్‌కు లేదా?

15 Apr, 2021 08:03 IST|Sakshi

సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్న

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అంబేడ్కర్, ఇతర మహనీయుల జయంతి, వర్ధంతి కార్య క్రమాలకు సీఎం కేసీఆర్‌ ఎందుకు హాజరుకావడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. దీనిపై సీఎం సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ లక్ష మందితో ఎన్నికలసభ పెట్టేందుకు సమయం దొరుకుతుంది కానీ అంబేడ్కర్‌కు నివాళి అర్పించే తీరిక దొరకడం లేదా? అని ప్రశ్నించారు.

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్‌కు సంబంధించిన ప్రాంతాలను పంచతీర్థాలుగా కేంద్రం అభివృద్ధి చేస్తోందన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ అంబేడ్కర్‌ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పే సీఎం కేసీఆర్‌ 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని అన్నా రు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్ర హం వద్ద   బండి సంజయ్‌తోపాటు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ నేతలు డా.కె.లక్ష్మణ్, డీకే అరుణ, వివేక్, విజయశాంతి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఘనంగా నివాళులు ఆర్పించారు. 

గాంధీభవన్‌లో..
బీఆర్‌ అంబేడ్కర్‌ 130వ జయంతిని గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావ్, ఓబీసీ సెల్‌చైర్మన్‌ నూతి శ్రీకాంత్, ఎస్సీ సెల్‌ విభాగం చైర్మన్‌ ప్రీతమ్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.

( చదవండి: ఢిల్లీ బస్సు వచ్చింది..  వంద కోట్లు మింగింది! )

మరిన్ని వార్తలు