ప్రజల కోసం పోరాడుతున్నాం.. మద్దతివ్వండి 

23 Nov, 2023 04:30 IST|Sakshi

బీజేపీ జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ 

కరీంనగర్‌ టౌన్‌: నిరుపేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని రెండుసార్లు ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను మోసం చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ మండిపడ్డారు. ప్రజల కోసం పోరాడుతున్న బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. బుధవారం కరీంనగర్‌లోని రేకుర్తి, మంకమ్మతోటలో నిర్వహించిన కార్నర్‌ మీటింగుల్లో ఆయన మాట్లాడారు.

ప్రధాని మోదీ 2,40,000 ఇళ్లు ఇస్తే కేసీఆర్‌ ఒక్కఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వకుండా కేసీఆర్‌ మాత్రం 100 గదులతో ప్రగతి భవన్‌ కట్టుకున్నారని దుయ్యబట్టారు. పదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా 30 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారన్నారు. కేసీఆర్‌ ఇంట్లో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.

నిరుద్యోగులు ప్రశ్నించిన పాపానికి కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్‌ చేశారని, పేపర్‌ లీకేజీలపై తాను కొట్లాడితే... తన ఇంటిపై వందల మంది పోలీసులతో దాడి చేయించి అరెస్ట్‌ చేయించారని మండిపడ్డారు.  
 

మరిన్ని వార్తలు