కేసీఆర్‌కు నేను ఎందుకు ఫేవర్‌గా ఉంటా: కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు

5 Nov, 2023 12:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో అన్ని సమస్యలకు కారణమే కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. ఎన్నికల వ్యవస్థను కేసీఆర్‌ చిధ్రం చేశారని అన్నారు. తెలంగాణలో హుజురాబాద్‌ ఫలితాలే మళ్లీ రిపీట్‌ అవుతాయని జోస్యం చెప్పారు. 

కాగా, కిషన్‌ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పోయి కాంగ్రెస్‌ వస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టే అవుతుంది. రుణమాఫీతో 30 శాతం మంది రైతులకు కూడా లాభం జరగలేదు. ఉస్మానియా ఆసుపత్రికి తాళాలు వేయాల్సిన దుస్థితి నెలకొంది. కేసీఆర్‌ సర్కార్‌ హయాంలో టీఎస్‌పీఎస్సీ పూర్తిగా విఫలమైంది. 17 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఒక కుటంబం చేతిలో ప్రజాస్వామ్యం బంధీగా ఉంది. ప్రజా ఆందోళనలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అణచివేసింది. సీఎం కేసీఆర్‌తో బహిరంగ చర్చకు నేను సిద్ధం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో నేను చెబుతా.. తెలంగాణకు కేంద్రం ఏం చేయలేదో చెప్పే దమ్ము, ధైర్యం కేసీఆర్‌కు ఉందా? ప్రెస్ క్లబ్ అయినా పర్వాలేదు, అమరవీరుల స్థూపం వద్ద అయిన బహిరంగ చర్చకు సిద్ధమని నేను సవాల్ విసురుతున్నాను. 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చూ​స్తూ కడుపు తరుక్కుపోతోంది. మేడిగడ్డ బ్యారేజ్‌లో ఉన్న 10 టీఎంసీల నీటిని ఖాళీ చేశారు. భద్రాచలం సీతారాముల కళ్యాణానికి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ వెళ్లడం లేదు. తన మనువడిని భద్రాచలం పంపడం ఎంత వరకు కరెక్ట్‌?. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎటు దారితీస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నికల వ్యవస్థను కేసీఆర్‌ చిధ్రం చేశారు. కామారెడ్డి, గజ్వేల్‌లో కేసీఆర్‌ ఓడిపోతారు. హుజురాబాద్‌ ఫలితాలే రిపీట్‌ అవుతాయి. 

రెండు పార్టీలు దొందు దొందే..
దేశంలో అన్ని సమస్యలకూ మూల కారణం కాంగ్రెస్ పార్టీనే. గ్యారెంటీలతో కర్ణాటకలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్.. ప్రజల వ్యతిరేకతను మూట కట్టుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి కాంగ్రెస్ డబ్బులు వసూలు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి వరకు 88 మంది అభ్యర్థులను ప్రకటించాం. మిగతా సీట్లలో అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటిస్తాం. కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ దొందు దొందే. కేసీఆర్‌కు నేను ఎందుకు ఫేవర్‌గా ఉంటాను. నేను ఎవరికీ లొంగను. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఆమె అరెస్ట్‌ను అడ్డుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటూ ముందుకు వెళ్తాయి. 

ఇది కూడా చదవండి: రూట్‌ మార్చిన కేటీఆర్‌.. గంగవ్వతో నాటుకోడి కూర వండి..

మరిన్ని వార్తలు