నల్లగొండ ఘటనపై గవర్నర్‌కి బీజేపీ నేతల ఫిర్యాదు

16 Nov, 2021 13:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ వాహనంపై, పలువురు నేతలపై దాడికి సంబంధించి బీజేపీ నేతలు గవర్నర్ తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర్‌ రాజన్‌ మంగళవారం రాజ్‌భవన్‌లో కలిశారు. బీజేపీ నేతలు రాజాసింగ్, డీకే అరుణ, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ తదితరులు గవర్నర్‌కు వినతి పత్రం ఇచ్చారు. నల్లగొండ ఘటనలో పోలీసుల వైఫల్యంపై గవర్నర్‌కి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

అనంతరం బీజేపీ నేత డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. వరి దాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో వరి ధాన్యాలు కొనుగోలు విషయంలో పర్యటించిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ దాడి చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే బండి సంజయ్‌పై దాడి జరిగిందని ఆరోపించారు. 

రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారని మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమీ జీర్ణించుకోలేక కేసీఆర్ బీజేపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఇదే విషయంపై గవర్నర్‌కు వినతిపత్రం అందించామని తెలిపారు. కేంద్ర కొనుగోలు చేయడం లేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు. సివిల్ సప్లై కార్పోరేషన్‌కు డబ్బులు ఇవ్వకుండా ధాన్యం కొనుగోలు చేయకుండా ముఖ్యమంత్రి ఆపుతున్నారని  అనుమనం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీజీపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని,  రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచుకోవడానికి రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగేవరకు బీజేపీ పోరాడుతుందని అన్నారు.
 

మరిన్ని వార్తలు