తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌.. రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

6 Dec, 2023 12:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్న వేళ గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. ఏడాది తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

కాగా, రాజాసింగ్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదు. ఒక్క ఏడాది మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటుంది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుంది. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్‌నే తెలంగాణ ప్రజలు మార్చేశారు అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఇదిలా ఉండగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. 

మరోవైపు.. తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి రేపు(గురువారం) ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1:42 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, రేవంత్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను కాంగ్రెస్‌ నేతలు, అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, రేవంత్‌ ‍ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి వీఐపీలు విచ్చేయనున్నారు. 

>
మరిన్ని వార్తలు