సీఎం కేసీఆర్‌ ప్రచార వాహనంలో తనిఖీలు.. ఎక్కడంటే?

20 Nov, 2023 10:51 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్‌ 30వ తేదీన పోలింగ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడ్‌ పెంచాయి. అధికార బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్‌ వినియోగిస్తున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు తనిఖీలు నిర్వహించాయి. 

వివరాల ప్రకారం.. సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు సోమవారం తనిఖీలు నిర్వహించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభకు హాజరవనున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణానికి ప్రగతి రథం బస్సు వెళ్తున్న సమయంలో కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి టోల్‌గేట్‌ వద్ద కేంద్ర బలగాలు నిర్వహించాయి. బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

అయితే, ఎన్నికల నిబంధనలను అనుసరించి బలగాలకు సిబ్బంది పూర్తిగా సహకరించారు. ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మానకొండూరు, స్టేషన్‌ఘన్‌పూర్‌, నకిరేకల్‌, నల్గొండ నియోజకవర్గాల్లో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై ప్రసంగించనున్నారు.

మరిన్ని వార్తలు