ఉత్తర భారతీయులపై తమిళ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

27 May, 2021 13:21 IST|Sakshi
ముఖ్యమంత్రి స్టాలిన్‌తో మంత్రి పీఎస్‌ శేఖర్‌ బాబు

చెన్నె: తమిళనాడులో ఇటీవల ఎన్నికలు ముగిసి రాజకీయంగా ప్రశాంత వాతావరణం ఏర్పడింది. ఈ సమయంలో ఉత్తర భారతీయులపై తమిళనాడు కొత్త మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. డీఎంకే పార్టీ వలనే ఉత్తర భారతీయులు సంపన్నులు అయ్యారని.. అయితే వారు మాత్రం తమకు మోసం చేశారని తెలిపారు.

చెన్నెలో బుధవారం జరిగిన ఓ సమావేశంలో ఆ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి పీఎస్‌ శేఖర్‌బాబు మాట్లాడుతూ.. ‘తమిళనాడులో నివసిస్తున్న ఉత్తర భారతీయులు డీఎంకే చేసిన కార్యక్రమాలు, పనులతో సంపాదించుకుని  ధనవంతులు అయ్యారు. అయితే వారు మాత్రం ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశారు. ఈవీఎంలలో ఓటు వేసినా ఎవరికి వేశారో తెలుసుకోవచ్చు. వారు ఇప్పుడే కాదు 2011 నుంచి ఇప్పటివరకు పార్టీకి ఓటు వేయడం లేదు. మనకు ఓటేయకున్నా వారికి సహాయం చేయండి. వారు అపరాధభావంతో సిగ్గుపడేలా చేయండి. వారు ఎప్పటికైనా తమ తప్పులను గ్రహించి సిగ్గుపడతారు’ అని పేర్కొన్నారు. 

డీఎంకే జిల్లా కార్యదర్శిగా ఉన్న పీఎస్‌ శేఖర్‌ బాబు హర్బర్‌ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యాడు. శేఖర్‌ బాబు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు సన్నిహితుడు. చెన్నెలోని కొన్ని ప్రాంతాల్లో ఉత్తర భారతీయులు స్థిరపడడంతో వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. 

మరిన్ని వార్తలు