సూర్యుడు, కత్తి-డాలు, రావి చెట్టు.. మూడింటిలో షిండేకు ఏ గుర్తు వచ్చేనో!

11 Oct, 2022 14:54 IST|Sakshi

ముంబై: అంధేరీ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు తమకు మూడు గుర్తుల్లో ఒకటి కేటాయించాలని ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపింది ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేన. సుర్యూడు, కత్తి-డాలు, రావి చెట్టు గుర్తులను పరిశీలించాలని కోరింది. మరి ఈ మూడింటిలో ఎన్నికల సంఘం ఏది ఖరారు చేస్తుందో చూడాలి.

అసలైన శివసేన తమదంటే తమదే అని ఉద్ధవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గం వాదిస్తున్న నేపథ్యంలో శివసేన పార్టీ పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణాన్ని ఈసీ తాత్కాలికంగా సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే నవంబర్ 3న జరిగే అంధేరీ ఉపఎన్నికల కోసం కొత్త పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి షిండే, థాక్రే వర్గాలు ఈసీకి కొన్ని ప్రతిపాదలను పంపాయి.

వీటిని పరిశీలించిన అధికారులు థాక్రే వర్గానికి 'శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్‌ థాక్రే)' పేరు, కాగడా గుర్తును సోమవారం ఖరారు చేసింది. అలాగే షిండే వర్గానికి 'బాలాసాహెబ్‌ శివసేన' పేరును ఫైనల్ చేసింది. కానీ షిండే అడిగిన ఎన్నికల గుర్తులు కొన్ని ఇప్పటికే రిజిస్టర్ అయినందున ఎలాంటి గుర్తును కేటాయించలేదు.  మళ్లీ కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే షిండే వర్గం మంగళవారం సూర్యుడు, కత్తి-డాలు, రావిచెట్టు గుర్తుల్లో ఒకటి కేటాయించాలని ఈసీని మళ్లీ కోరింది.
చదవండి: థాక్రే వర్గానికి పార్టీ పేరు గుర్తు ఖరారు చేసిన ఈసీ.. షిండేకు షాక్‌!

మరిన్ని వార్తలు