మేయర్‌ ఎన్నిక: ‘ఓవైసీ, కేసీఆర్‌ చీకటి ఒప్పందం’

11 Feb, 2021 14:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్‌ మేయర్ ఎన్నికతో అసదుద్దిన్‌ ఓవైసీ, సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందం బయటపడిందని నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ దర్మపురి అర్వింద్‌ వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికలో ఎంఐఎం పోటీ చేయకుండా అధికార టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రటించిన విషయం తెలిసిందే. మేయర్‌ అభ్యర్థిని బరిలో నిలపకుండా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి విజయానికి సపొర్టు తెలిపింది. దీంతో మిత్రపక్షం  ఎంఐఎంతో కలిసి టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది. సందర్భంగా ఢిల్లీలో ఎంపీ గురువారం మాట్లాడుతూ.. రాబోయే ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యమని అన్నారు.

అదే విధంగా గిరిజన మహిళల మీద కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ అర్వింద్‌ ఖండించారు. మీటింగ్‌కు వచ్చిన మహిళలను కుక్కలతో పోలుస్తావా అని కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. కేసీఆర్‌ అబద్ధాలు చెప్పడు అంటే అది పెద్ద జోక్ అని ఎంపీ అర్వింద్‌ అన్నారు. కేసీఆర్ పెద్ద అవినీతి పుట్ట అని పేర్కొన్నారు. ప్రతి ఊరికి అంతా ఇస్తా ఇంతా ఇస్తా అనడం అబద్దమని, నాగార్జునసాగర్ ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. అసెంబ్లీలో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మూడు గుంటలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
చదవండి:వారిది అక్రమ సంబంధం: మేయర్‌ ఎన్నికపై బండి సంజయ్‌

మరిన్ని వార్తలు