జనం మాటే. జగన్ బాట. ఆపదలో ఆపన్నహస్తం. కష్టాల్లో తోడు నీడ. అనేకమంది ఆశలకు, ఆశయాలకు రెక్కలు...ఏ దైవం పంపాడో ..పండగలా దిగివచ్చిన దేవుడు. తమ నీడకు నీడై, తోడుకు తోడై..వెలుగు పూలు పూయించిన జనహృదయనేత. జయహో జగన్. ఇదీ జనం మాట!
అడగనిదే అమ్మ అయినా పెట్టదు అనేది సామెత. అన్నా..అని సాయం కోరితే చాలు.. నేనున్నానంటూ ఇచ్చే కొండంత ధైర్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మాకూ ఓ జగన్ కావాలనేంత.. భరోసా! మాట నిలబెట్టు కోవడంలో, హామీలను తు.చ. తప్పకుండా నెరవేర్చడంలో ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ తరువాతే ఎవరైనా. అన్నదాతలను అక్కున చేర్చు కోవడం దగ్గరినించి వైద్య ఆరోగ్య సేవల వరకు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్ల నుంచి , మహిళా సాధికారత వరకు, చదువుల నుంచి పౌరసేవల దాకా అన్నింటా ఆయనొక భరోసా.
ఆడపడుచులకు అండగా, బిడ్డలకు విద్యా దీవెనగా, పేద బడుగు వర్గాల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలు ఆయన మానస పుత్రికలు. కనుకనే ఎన్ని విమర్శ లొచ్చినా నిండుమనసుతో అమలు చేస్తున్న నిబద్ధత ఆయన సొంతం. అందుకే మాట తప్పని నేతగా, జననేతగా నిలిచారు. అంతేకాదు కరువొచ్చినా, కష్టమొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా, అరుదైన వ్యాధి వచ్చినా, చదువు కోవాలన్నా ‘నేను ఉన్నాను’ అంటూ ఆదుకునే ఆ మంచి మనసు భరోసా నభూతో నభవిష్యతి. తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని రుజువు చేస్తూ జననీరాజనాలు అందుకుంటున్నారు సీఎం జగన్.
అవినీతికి, వివక్షకు తావులేకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు వేగిరమే ముందుకు రావడమే కాదు. ప్రకటించిన సంబంధిత సాయాన్ని తక్షణమే అందించడంలో ఆయన తీరే వేరు. బాధితులకు ఆర్థిక సాయం అందించడంలో గానీ, ఉద్యోగార్థులకు ఉద్యోగావకాశాన్ని కల్పించడంలో గానీ, ముఖ్యంగా తుపాను సమయాల్లో, ప్రభావిత ప్రాంతాలను పర్యటించడంలోగానీ, బాధితులను ఆదుకోవడంలోగానీ సీఎం జగన్ ఎపుడూ ముందే ఉంటారు. బాధితులను ఆదుకునేలా వెనువెంటనే సాయాన్ని అందించే పెద్ద మనసు. అలాగే ఆరుగాలం పండించిన పంట పాడైపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అన్నదాతలను ఓదార్చి, వరద ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని యుద్ధ ప్రాతిపదికన జమచేసిన ఘనత ఆయనది. ఇటీవల మిచౌంగ్ తుపాను కారణంగా తడిసిన ధాన్యంలో ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను తీసుకొవడమే ఇందుకు గొప్ప నిదర్శనం.
2023లొ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన శ్రావణి పైలట్ కావాలన్నకలను నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. శ్రావణి ఏవియేషన్ శిక్షణకు రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. విజయవాడలో కేన్సర్తో బాధపడుతున్న చిన్నారికి తక్షణమే సాయం, అన్ని విధాలా ఆదకుంటామని హామీ. 2022లో అరుదైన ‘గాకర్స్’ వ్యాధితో బాధపడుతున్న హనీ చిన్నారికి కోటి రూపాయిల సాయం అందించారు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి హృదయానికి హత్తుకునే ఘటనలు కోకొల్లలు.
ఉద్ధానమా.. గర్వించు!
అంతెందుకు ఏ నాయకుడూ నామమాత్రంగా కూడా పట్టించుకోని శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం సంగతి చూడండి. ఉద్ధానం కిడ్నీ బాధితులకిచ్చిన మాటను జగన్ అక్షరాల నెరవేర్చిన సందర్భం అపూర్వం, వేనోళ్ల కీర్తి దగించిందే! దశాబ్దాల తరబడి ఆ ప్రాంత వాసులను వేధించిన సమస్యకు శాశ్వత పరిష్కారంగా వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మచ్చుతునకలు. వీటన్నింటికీ మించి ఆయన రాష్ట్రంలో ఏమూల పర్యటనకు వెళ్లినా.. పేద, గొప్ప, కులం, జాతి మతంతో సంబంధం లేకుండా తన దగ్గరికొచ్చిన వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా అక్కున చేర్చుకోవడం ఆయన ప్రత్యేకత. ఏ ప్రజకైనా తమ నాయకుడిని నెత్తిన పెట్టుకోవడానికి ఇంతకన్నా ఏం కావాలి. (విన్నారు.. ఆదుకున్నారు)
కోవిడ్-19 సంక్షోభ సమయంలో వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్రంలోని లక్షలాదిమంది ప్రజల్ని మహమ్మారి ముప్పునుంచి కాపాడాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును, ప్రశంసల్ని దక్కించుకున్నాయి. కరోనా కష్టకాలంలో తమ ప్రియతమ నేత తీసుకున్న కీలక నిర్ణయాలు, చూపించిన ప్రేమ, ఆదరణను ఇప్పటికీ, ఎప్పటికీ ప్రజలు మరువలేరు. సీఎం జనగ్ సేవలను గుర్తు చేసుకుంటూ కన్నతండ్రిలా తమను ఆదుకున్న జన నేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ‘‘హ్యాపీ బర్త్డే జగనన్నా.. వెయ్యేళ్లు వర్ధిల్లు’’ అంటూ నిండు మనసుతో జనం ఆశీర్వదిస్తున్నారు.