నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకోం

17 Aug, 2020 19:47 IST|Sakshi

చంద్రబాబుకు హోంమంత్రి సుచరిత హెచ్చరిక

సాక్షి, గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుది అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే వ్యక్తిత్వమని హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. సోమవారం హోంమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కుట్ర పూరితంగానే ప్రభుత్వంపై తప్పుడు కథనాలు రాయించారని, ప్రధానమంత్రికి చంద్రబాబు లేఖ రాయడం కూడా కుట్రలో భాగమన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆధారాలుంటే చూపించాలని మంత్రి సవాలు విసిరారు. (చదవండి: రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గింది: సుచరిత)

రాజకీయ భవిష్యత్తు లేదనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారని, నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గతంలో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నారన్నారు. కరోనా కష్ట కాలంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని ఆయన నేరవేర్చారని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. చంద్రబాబు కుట్రలను ప్రజలే తిప్పికొడతారని, నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని సుచరిత పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు