జార్ఖండ్‌ గవర్నర్‌పై జేఎంఎం నేత కీలక వ్యాఖ్యలు

4 Feb, 2024 16:30 IST|Sakshi

రాంచీ: జార్ఖండ్‌లో అధికార పార్టీ జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) ఆ రాష్ట్ర గవర్నర్‌పై ఫైర్‌ అయ్యింది. తమ ప్రభుత్వాన్ని మళ్లీ బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్‌ నేరుగా ఎందుకు ఆదేశించారని, ఈ విషయంలో ఆయనను ఎవరు ప్రభావితం చేశారో చెప్పాలని జేఎంఎం జనరల్‌ సెక్రటరీ సుప్రియో భట్టాచార్య డిమాండ్‌ చేశారు.    

‘ఎక్కడైనా ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే గవర్నర్‌ కేర్‌టేకర్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ గవర్నర్‌  అలాంటిదేమీ చేయలేదు.  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జనవరి 31వ తేదీనే మేం సంసిద్ధతను వ్యక్తం చేశాం. మా లెజిస్లేచర్‌ పార్టీ నేతను ప్రమాణస్వీకారం చేయాల్సిందిగా గవర్నర్‌ ఎందుకు ఆహ్వానించలేదు. 

ప్రజల నుంచి ఉన్న ఒత్తిడి వచ్చిన తర్వాతే గవర్నర్‌ మమ్మల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా పిలిచారు. కానీ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఫ్లోర్‌ టెస్ట్‌కు ఎందుకు ఆదేశించారు. దీనికి హేతుబద్దత ఏంటో తెలియదు. మాకు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది’ అని సుప్రియో భట్టాచార్య తెలిపారు. 

కాగా జార్ఖండ్‌ అసెంబ్లీలో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభుత్వం సోమవారం(ఫిబ్రవరి 5)​ మెజార్టీ నిరూపించుకోవాల్సి ఉంది. మెజార్టీ నిరూపించుకోవడానికి కావాల్సిన సభ్యుల బలం ఇండియా కూటమి ప్రభుత్వానికి ఉందని జేఎంఎం, కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. 

ఇదీచదవండి.. విమానంలో మహిళతో అసభ్య ప్రవర్తన

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega