-

టీడీపీ పెత్తందారీ వ్యవస్థను బద్దలుకొట్టిన వ్యక్తి సీఎం జగన్‌: జోగి రమేష్‌

21 Feb, 2023 11:11 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉన్నారని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. సామాజిక న్యాయం అంటే ఏంటో సీఎం జగన్‌ నిరూపించారని తెలిపారు. టీడీపీ పెత్తందారీ వ్యవస్థను బద్దలుకొట్టిన వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు. సామాజిక విప్లవం వైపు ఆయన అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు.​

ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ.. ‘సీఎం జగన్‌తోనే సామాజిక న్యాయం సాధ్యం. 75 ఏళ్ల చరిత్రలో ఏపీలో మాత్రమే సామాజిక న్యాయం జరిగింది. సీఎం బీసీలను తల ఎత్తుకునేలా చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో సంక్షేమం, అభివృద్ధి వెల్లివిరిస్తోంది. ఆయన పాలనలో బలహీన వర్గాలవారు ఎవరెస్ట్‌ ఎక్కినంత సంతోషంగా ఉన్నారు. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ప్రభుత్వం. రిజర్వేషన్‌లు లేకపోయినా ఎక్కువ పదవులు ఇచ్చిన ఘనత జగన్ ది. డీబీటీ ద్వారా సుమారు రూ.2లక్షల కోట్లు అందజేశారు.

లోకేష్‌ తన స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ స్థానాలను బేరానికి పెట్టిన వ్యక్తి చంద్రబాబు. టీడీపీ రాజ్యసభ స్థానాలను సూట్‌కేసుల కోసం అమ్ముకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై చంద్రబాబు, లోకేష్‌ విషం కక్కుతున్నారు. పొత్తులు పెట్టుకుని పొర్లాడినా టీడీపీని జనం పట్టించుకోరు. టీడీపీని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం అందరిపై ఉంది. 

అసెంబ్లీ నుంచి పారిపోయిన చంద్రబాబు రోడ్లమీద ఏదేదో మాట్లాడుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికి ఎవరి హయాంలో సామాజిక న్యాయం జరిగిందో చర్చకు చంద్రబాబు సిద్ధమా’ అని సవాల్‌ విసిరారు. చర్చకు వచ్చే దమ్ము చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. బీసీలపై చంద్రబాబుకు నిజంగా ప్రేమ ఉంటే చర్చకు రావాలని మంత్రి జోగి రమేష్‌ ఛాలెంజ్‌ చేశారు.
చదవండి: టికెట్టా.. వద్దే వద్దు! ఇంటర్నల్‌ సర్వేలతో బెంబేలెత్తుతున్న టీడీపీ నేతలు

మరిన్ని వార్తలు