పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున కాంగ్రెస్‌.. మునుగోడులో ఆయన చక్రం తిప్పుతారా?

4 Oct, 2022 16:02 IST|Sakshi

సాక్షి, మునుగోడు: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్‌ కొనసాగుతోంది. గెలుపుపై అన్ని రాజకీయ పార్టీల నేతలు వ్యూహాలు రచించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మునుగోడులో విజయమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 

కాగా, మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా సమీక్ష కోసం ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్‌తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మునుగోడు అభ్యర్ధి పాల్వాయి స్రవంతిరెడ్డితో పాటు ఇతర కీలక నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ప్రచారానికి వస్తారని స్రవంతి రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి ప్రచారానికి వస్తారని తనకు మాటిచ్చారని చెప్పుకొచ్చారు. దీంతో, కాంగ్రెస్‌ పార్టీకి కొంత మేలు జరిగే అవకాశముంది. 

మునుగోడులో కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుంది. రెండు రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా, ఉప ఎన్నికల్లో భాగంగా ఈ నెల 14న తాను నామినేషన్ వేస్తున్నట్లు స్రవంతి ప్రకటించారు. మరోవైపు.. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం రేవంత్‌ రెడ్డి.. మునుగోడు సభలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు