పబ్బులు, డ్రగ్స్ విషయంలో హైదరాబాద్ ముందుంది

16 Sep, 2020 19:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అప్పులు చేయటానికి అవసరమైన బిల్లులు పాస్ చేయటానికే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. 'శాసనసభలో ప్రభుత్వం సమస్యలపై మాట్లాడలేకే పారిపోయింది. బీఏసీలో 28వ తేదీ తర్వాత కూడా అసెంబ్లీని జరపుతామన్నారు. అయితే కాంగ్రెస్‌కు సమాధానం చెప్పలేక పారిపోయారు. ఏపీ ప్రభుత్వం రోజుకు 12 టీఎంసీలు శ్రీశైలం నుండి వాడుకుంటోంది. దీనివల్ల తెలంగాణలో భారీ నీటికొరత ఏర్పడింది.

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తోంది. నిరుద్యోగ సమస్యపై మాట్లాడనివ్వలేదు. వర్షాలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రయివేట్ టీచర్లు, చేనేత కార్మికులు, పేదల సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రంపై 6లక్షల కోట్ల అప్పులు మోపడానికే కేసీఆర్ సభను ఉపయోగించుకున్నారు. 100 మంది ఉన్న టీఆర్ఎస్ సభ్యులను ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలం ఎదుర్కొన్నాం. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. బీహెచ్ఈఎల్, రింగ్ రోడ్డు, హాస్పిటళ్లు, ఎయిర్ పోర్టు అన్నీ కాంగ్రెస్ నిర్మించినవే. దళితులకు మూడెకరాల భూమిని పంచినపుడే అంబేద్కర్‌కి అసలైన నివాళి' అని అన్నారు.  (ట్రాఫిక్‌ జరిమానాలు ఆపేయాలి: జగ్గారెడ్డి)

ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు- ఎమ్మెల్యే సీతక్క
అసెంబ్లీకి ముందు కేసీఆర్‌ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ సభ్యుల్ని అవమానకరంగా మాట్లాడారు. కరోనా టెస్టులు చాలా తక్కువ చేశారు. జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చెప్పనివ్వలేదు. పబ్బులు, డ్రగ్స్ విషయంలో హైదరాబాద్ పేరు ముందు ఉంటుంది. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం అంబాసిడర్‌గా పెట్టుకున్న రకుల్ పేరు వినిపిస్తోంది. మంచినీళ్లు ఇవ్వలేని పరుస్థితిలో ప్రభుత్వం ఉన్నది. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు' అని సీతక్క పేర్కొంది.  (శివ బాలాజీ ఫిర్యాదుపై హెచ్‌ఆర్‌సీ స్పందన)

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు- దుద్దిళ్ల శ్రీధర్ బాబు
8రోజుల్లోని 31గంటల్లో 24 గంటలు సీఎం, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. వారి మిత్రపక్షం ఎంఐఎంకు 3 గంటలు మాట్లాడించారు. కాంగ్రెస్‌కు ఇచ్చిన 3 గంటల్లో అనేకసార్లు అడ్డు తగిలారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రేపటి నుంచి వర్చువల్ అసెంబ్లీ సెషన్ పెట్టాలి. ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.

మరిన్ని వార్తలు