‘కాలు నొప్పి ఏమైంది దీదీ.. ఈ డ్యాన్స్‌ ఏంటి’

3 Apr, 2021 20:54 IST|Sakshi

బ్యాండేజ్‌ వేసిన కాలును కదిలిస్తోన్న దీదీ

సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎలాగైనా సరే రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ చూస్తుంటే.. కాషాయ పార్టీని బెంగాల్‌ దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదనే కృత నిశ్చయంతో ఉన్నారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ‘‘బీజేపీ మీద తిరుగలేని పోరాటం చేసే ఏకైక వ్యక్తి దీదీ. అలాంటి మమతా కూడా ఈ సారి భయపడ్డారు.. అందుకే ఆమెకు అలవాటు లేని పనులు చేస్తున్నారు’’ అనే మాటలు వినిపిస్తున్నాయి. నందిగ్రామ్‌లో నామినేషన్‌ వేసి తిరిగి వస్తుండగా మమతకు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తనపై దాడి జరిగిందని దీదీ ఆరోపిస్తుండగా.. జనం పెద్ద ఎత్తున రావడంతోనే ఆమెకు ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. 

ఇక నాటి నుంచి మమత వీల్‌ చైర్‌లోనే కనిపిస్తున్నారు. ఈ విషయం ఆమెను అభిమానించే వారికి నచ్చడం లేదు. కాళికలా ఉండే మమతా ఇలా సానుభూతి కోసం ప్రయత్నించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇలా చర్చ జరుగుతుండగానే తాజాగా మమతా బెనర్జీకి సంబంధించి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ట్విట్టర్‌లో ట్రెండింగ్లో‌ కొనసాగుతోంది. ఇంతకు ఈ వీడియోలో ఏం ఉందంటే.. మమతా రెండు కాళ్లను వెనకకు, ముందుకు ఆడిస్తూ రిలాక్స్‌ అవుతున్నారు. ప్రమాదంలో కట్టుకట్టిన కాలును కూడా చాలా సింపుల్‌గా కదిలిస్తున్నారు. 

ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుందనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత బీజేపీ నాయకులు దీదీని ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు బీజేపీ నాయకులు. ‘‘కాలుకి దెబ్బ తగిలింది.. కుట్రపూరితంగానే నాపై దాడి చేశారని ఆరోపించావ్‌.. మరి ఇదేంటి దీదీ’’ అని ప్రశ్నిస్తున్నారు. ‘‘డ్రామాలు ఆపేయ్‌.. జనాలకు నీ గురించి తెలిసిపోయింది... సింపతీ కోసం ఎంత ప్రయత్నించినా వృథా’’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. టీఎంసీ చెత్త రాజకీయాలకు నిదర్శనం ఈ వీడియో అంటూ విమర్శిస్తున్నారు బీజేపీ నాయకులు.

చదవండి: నేను పులి: ‘నందిగ్రామ్‌’లో మమతా బెనర్జీ గర్జన

మరిన్ని వార్తలు