మళ్లీ వచ్చేది మేమే: మంత్రి అంబటి

29 Nov, 2023 16:02 IST|Sakshi

 సాక్షి, అనపర్తి : మ్యానిపెస్టోలోని సంక్షేమ పథకాలన్నీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బుధవారం అంబటి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘కరోనా కష్ట కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు అల్లాడిపోతుంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే వెనకడుగు వేయకుండా సంక్షేమ పధకాలు అమలుచేశారు. విద్య, వైద్యం విషయంలో సీఎం చాలా స్పష్టతతో ఉన్నారు. ప్రతీ పేద విద్యార్థి కార్పొరేట్ విద్య అభ్యసిస్తున్నాడంటే కారణం సీఎం జగన్మోహన్‌రెడ్డే. వెల్‌నెస్‌ సెంటర్ల ద్వారా  ప్రతీ గ్రామంలోనూ వైద్యం అందుబాటులోకి వచ్చింది’అని అంబటి తెలిపారు.

‘పోలవరం ప్రాజెక్టు ప్రారంభంపై ఎప్పుడు ఒక ముహూర్తమంటూ నేనెప్పుడూ చెప్పలేదు. గత ప్రభుత్వాలు చేసిన పనుల ఆధారంగా ఈ ఐదేళ్లలో పనులు పూర్తవుతాయనుకున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డైరెక్టుగా వెళ్లి చూస్తే అక్కడ మొత్తం అవకతవకలే. ఏదేమైనా మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు ప్రారంభించడం ఖాయం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ముసుగులో టీడీపీ కోవర్టుగా ఉన్న వ్యక్తి పురంధేశ్వరి. లోకేష్ యువగళం పాదయాత్ర ఒక కామెడీ షో’ అని అంబటి ఎద్దేవా చేశారు. 

‘ఎన్టీఆర్ మనవడు అన్న ఒకే ఒక్క కారణంతో రాజకీయాల్లో చెలామణి అవుతున్న వ్యక్తి లోకేష్. టీడీపీకి ఒక శనిలా దాపురించిన వ్యక్తి లోకేష్. రాష్ట్రం గురించి అవగాహన లేని ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ అతనికి వత్తాసు పలుకుతున్నాడు. ప్రస్తుతం ఏపీలో ప్రజలంతా చాలా స్పష్టంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా మళ్ళీ వైఎస్‌ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు’అని అంబటి తెలిపారు.

ఇదీచదవండి..క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన సీఎం జగన్‌

మరిన్ని వార్తలు