కులగణన తెలిశాక టీడీపీ వారికి కూసాలు కదిలాయి: మంత్రి చెల్లుబోయిన

24 Nov, 2023 15:54 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. బీసీల తోలు తీస్తాం, తోకలు కట్ చేస్తానని చంద్రబాబు అన్నారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలను అక్కున చేర్చుకున్నారని కామెంట్స్‌ చేశారు. సామాజిక సాధికారతకు సీఎం జగన్‌ చిరునామా అని వ్యాఖ్యలు చేశారు. 

కాగా, మంత్రి చెల్లుబోయిన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కులగణనపై నాలుగు ప్రాంతాల్లో రౌండు టేబుల్‌ సమావేశాలు పెడుతున్నాం. ఈనెల 27 నుంచి కుల గణన చేయాలనుకున్నాం. కానీ, మరొకొద్ది రోజులు వాయిదా వేశాం. డిసెంబర్‌ పది నుంచి కుల గణన చేస్తాం. క్రింది స్థాయి నుండి వచ్చే అందరి సూచనలు తెలుసుకుంటున్నందున పది రోజులు ఆలస్యం అవుతోంది. బీహార్‌లో చేసిన కులగణనను పరిశీలించాం. కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాం. 

కులాలవారీగా ఎవరెవరు ఎంతమంది ఉన్నారు?. వారి జీవన స్థితి ఎలా ఉందని తేల్చాలని చాలాకాలంగా డిమాండ్‌ ఉంది. సామాజిక సాధికారతకు చిరునామా సీఎం జగన్‌. అసెంబ్లీ, మండలి, పార్లమెంట్‌లో సీఎం జగన్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించారు. మహిళలకు సగం రిజర్వేషన్‌ కల్పించారు. సోషల్ జస్టిస్ ఆచరించటంలో సీఎం జగన్ విజయం సాధించారు. 

మా కులగణన తెలిశాక టీడీపీ వారికి కూసాలు కదిలాయి. వాలంటీర్లు ఈ కులగణనలో పాల్గొనకూడదని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అసలు వాలంటీర్ల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. మేము చేసే కులగణన చరిత్రలో నిలిచిపోతుంది. ఐదు రీజనల్ మీటింగులు, జిల్లాల మీటింగులు నిర్వహించి సూచనలు‌ తీసుకున్నాం. ఇంకా మండల స్థాయిలో కూడా చేయాలనుకుంటున్నాం. కానీ, టీడీపీ వారికి కూసాలు కదిలి, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు.  చంద్రబాబు అబద్ధం అనే ఆస్తిని అందరికీ పంచాలనుకుంటున్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఈరోజు మళ్ళీ దండాలు పెడుతున్నారు. అబద్దాలు ఆరు రూపాలుగా చంద్రబాబు, లోకేశ్‌, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ నిలిచారు. ఎల్లోమీడియాలో వచ్చేవన్నీ అబద్దాలే తప్ప వార్తలు కాదు. కులగణన దేశంలో చరిత్త సృష్టిస్తుంది’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు