రైతుబంధు ఆపాలని ఎలా ఫిర్యాదు చేస్తారు: హరీష్‌ రావు ఫైర్‌

26 Oct, 2023 15:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీపై మంత్రి హరీష్‌ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత కరెంట్‌ అంటూ కాంగ్రెస్‌ ఉత్త కరెంట్‌ చేసిందని ఎద్దేవా చేశారు. అన్నదాతలపై కాంగ్రెస్‌కు కనికరం లేదు. కాంగ్రెస్‌ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఘాటు విమర్శలు చేశారు. 

కాగా, మంత్రి హరీష్‌ రావు గురువారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘​కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతులకు కేవలం ఐదు గంటల కరెంట్‌ మాత్రమే ఇస్తున్నారు. కాంగ్రెస్‌ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఎన్నికల్లో తెలంగాణలో 61 లక్షల మంది రైతులు కాంగ్రెస్‌ డిపాజిట్లు గల్లంతు చేస్తారు. రైతుబంధు అనేది కొత్త పథకం కాదు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వంలో పదకొండు సార్లు రైతు బంధు అందించాం. 12వ సారి ఇవ్వబోతుంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. కరోనా కష్ట కాలంలో కూడా రైతులకు రైతుబంధు ఇచ్చాం. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాంరాం అంటారు. 

రైతుబంధును నిలిపివేయాలని ఈసీని కాంగ్రెస్‌ ఎలా కోరుతుంది?. రైతుబంధు అందకుండా కాంగ్రెస్‌ కుట్రలు చేస్తోంది. స్వయంగా తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్‌ మూడు గంటల కరెంట్‌ ఇస్తామన్నారు. డిసెంబర్‌ మూడో తేదీ తర్వాత కేసీఆర్‌ హ్యాట్రిక్‌ ముఖ్యమంత్రి అవుతారు. గత ప్రభుత్వాలు రైతుల నుంచి పన్ను కట్టించుకుంటే.. కేసీఆర్ రైతులకు డబ్బులు పంచారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పినా ఓట్లు వేయరు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పెన్షన్లు, కేసీఆర్ కిట్ కూడా అపమంటారేమో అనిపిస్తోంది. రైతుల జోలికి వస్తే ఖబర్ధార్ అని హెచ్చరిస్తున్నాము. ణాటక ప్రజలు కొడంగల్, గద్వాల్‌లో కరెంట్ విషయంలో ఆందోళన చేశారు. రైతు రుణమాఫీ కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాశాము’అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ట్విస్ట్‌.. 18 మందికి సీటు దక్కేనా?

మరిన్ని వార్తలు