-

రైతుబంధు నిలిపివేతపై మంత్రి హరీశ్‌ కామెంట్స్‌..

27 Nov, 2023 11:53 IST|Sakshi

సాక్షి, జహీరాబాద్‌: ఎన్నికల వేళ ఎలక్షన్‌ కమిషన్‌ రైతుబంధు నిలిపివేయడంపై మంత్రి హరీశ్‌ రావు స్పందించారు. రైతుబంధు ఇవ్వవద్దని కాంగ్రెస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. రైతుబంధును ఎన్ని రోజులు ఆపుతారని ప్రశ్నించారు. వచ్చే నెల మూడో తేదీ తర్వాత మళ్లీ గెలిచేది మేమే.. అప్పుడ రైతుబంధు ఇస్తామని స్పష్టం చేశారు. 

కాగా, మంత్రి హరీశ్‌ రావు జహీరాబాద్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. ‘తెలంగాణ రైతులతో పేగుబంధం మాది. కాంగ్రెస్‌ పార్టీ రైతుల నోటికాడ బుక్కను లాక్కుంది. రైతుబంధు ఇవ్వవద్దని కాంగ్రెస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. నేను మీటింగ్‌లో న్యాయం గెలిచిందని.. రైతుబంధుకు ఈసీ క్లియరెన్స్‌ ఇచ్చిందని అన్నాను. రైతుబంధును ఆపిన కాంగ్రెస్‌కు ఓటుతోనే పోటు పొడవాలి. రైతుబంధు రావాలంటే కాంగ్రెస్‌ ఖతమ్‌ కావాలి. రైతుబంధును ఎన్ని రోజులు ఆపుతారు. వచ్చే నెల మూడో తేదీ తర్వాత మళ్లీ గెలిచేది మేమే.. అప్పుడ రైతుబంధు ఇస్తాం. ఎకరాకు రైతుబంధు కాదు.. ఒక్కో రైతుకు 15వేలు ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది. ఓట్ల కోసం రైతుబంధు తీసుకురాలేదు. 

కేసీఆర్‌ వస్తే పెన్షన్‌ రూ.5వేలు ఇస్తాం. సౌభాగ్యలక్ష్మి పేరుతో మహిళలకు నెలకు రూ.3వేలు ఇస్తాం. పేదలకు రూ.400లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తాం. రేషన్‌కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తాం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ఝురాసంఘంలో ఆరువేల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ఇస్తాం’ అని తెలిపారు. 


 

మరిన్ని వార్తలు