పార్లమెంట్‌ కొత్త భవనంలోనే ప్రత్యేక సమావేశాలు

6 Sep, 2023 14:13 IST|Sakshi

ఢిల్లీ: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దిగ్విజయంగా నూతన పార్లమెంట్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. మే 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. అయితే.. నూతన పార్లమెంట్‌లో  మొదటి సమావేశాలను వచ్చే ఏడాది ఎన్నిక కానున్న కొత్త ప్రభుత్వమే నిర్వహిస్తుందని అందరూ ఊహించారు. కానీ కేంద్రం ఈ నెల 18-22 వరకు ప్రత్యేక సమావేశాలను కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేసింది. 

కొత్త పార్లమెంట్‍లో నిర్వహించనున్న మొదటి సమావేశాల్లోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం తెరమీదకు వచ్చిన జమిలీ ఎన్నికలు, ఇండియా పేరు మార్పు వంటి బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే నూతన పార్లమెంట్‌ మొదటి సమావేశంలోనే దేశ చరిత్రలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లవుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నామని స్పష్టం చేసింది. ఈ సెషన్‌ అజెండాను మాత్రం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. ఈ సమావేశాల అజెండా ఏంటో తెలపాలని కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశారు.

ఇదీ చదవండి: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలెందుకు?.. ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ


 

మరిన్ని వార్తలు