రజనీ కొత్త పార్టీ పేరు మక్కల్‌ సేవై కర్చీ, గుర్తు అదేనా ?

15 Dec, 2020 10:30 IST|Sakshi

సాక్షి, చెన్నై : వచ్చే ఏడాది మే నెలలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ సమాయత్తం అవుతున్నారు. డిసెంబర్‌ 31న పార్టీ పేరు… జనవరి ఒకటిన పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ ఇప్పటికే రజనీ ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ పేరు, చిహ్నంపై ఇప్పటికే తీవ్ర కసరత్తు జరిపారట. రజనీ పార్టీ పేరును మక్కల్‌ సేవై కర్చీగా(ప్రజా సేవా పార్టీ) రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీకి గుర్తుగా ఆటోను కేటాయించినట్లు సమాచారం. ఈ మేరకు రజినీకాంత్ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులకు ప్రతిపాదనలను పంపించినట్లు తమిళ మీడియా వెల్లడించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ప్రతిపాదనలను ఆమోదించాల్సి ఉందని తెలిపింది. ఇందులో మార్పులు చేర్పులు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉండొచ్చని సమాచారం.

పార్టీ గుర్తుగా సైకిల్‌ గుర్తును కేటాయించినట్లు గతంలో ఊహాగానాలు వచ్చినప్పటికీ చివరికి ఆటో గుర్తు ఖారారైనట్లు తెలుస్తోంది. తన సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన బాషా సినిమాలో ఆటో డ్రైవర్ క్యారెక్టర్‌నే పొలిటికల్ కెరీర్ గా కూడా వాడుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  రజనీ పార్టీ మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు