పల్లా, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య కుదిరిన సయోధ్య

10 Oct, 2023 16:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని హీటెక్కించిన జనగామ జగడానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెక్‌ పెట్టారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో జనగామ ప్రజాప్రతినిధులు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి లతో మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు.

జనగామ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించుకోవాలని కేటీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. ఈ భేటీలో మరో ఇద్దరు టికెట్ ఆశావహులు మండల శ్రీరాములు మరో ఆశావాహి కిరణ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

అయితే, తెలంగాణ ఆర్టీసీ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినా.. జనగామలో బీఆర్‌ఎస్‌ తరపున బరిలో తానే ఉంటానంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. మరోవైపు, జనగామ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారని బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్న తరుణంలో పల్లాను గెలిపించుకోవాలంటూ.. ఈ రోజు జరిగిన భేటీలో కేటీఆరే స్వయంగా చెప్పారు.

ఆగస్టు 21న 115 మంది అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని పెండింగ్‌లో పెట్టారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ పదవిని బీఆర్‌ఎస్‌ పార్టీ కట్టబెట్టింది. పల్లాకు లైన్‌ క్లీయర్‌ చేసేందుకే ముత్తిరెడ్డికి ఆ పదవిని ఇచ్చినట్లు సమాచారం.
చదవండి: ఎమ్మెల్సీకి లైన్‌ క్లియర్‌ అయినట్టేనా? ‘పల్లా’ కేనా..!?

మరిన్ని వార్తలు