40 సీట్లు చాలు.. అందులోనూ 30 ముఖ్యం!

10 Mar, 2021 10:04 IST|Sakshi
టీటీవీ దినకరన్‌- మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ

దినకరన్‌ మార్కు వ్యూహాలు

సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం 40 స్థానాలపై గురి పెట్టింది. ఇందులో 30 స్థానాల్ని కైవసం చేసుకోవడం లక్ష్యంగా ఆపార్టీ నేత దినకరన్‌ వ్యూహాలకు పదును పెట్టారు. శశికళ రాజకీయాల నుంచి అస్త్ర సన్యాసం తీసుకోవడంతో ఆమె ప్రతినిధి దినకరన్‌ తన మార్క్‌ రాజకీయ వ్యూహాలకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో 234 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమైనా, ప్రధానంగా 40 స్థానాలు చాలు అన్నట్టుగా నిర్ణయించినట్టు సమాచారం. ఇందులోనూ 30 సీట్లపై గురిపెట్టి చాపకింద నీరులా పనుల వేగాన్ని పెంచారు. ఏ,బీ,సీ అంటూ ఈ నియోజకవర్గాల్ని విభజించి లెక్కకు తగ్గ వ్యూహాన్ని ఆయన రచించి ఉండడం గమనార్హం.

ఇందులో 10 మంది అనర్హత వేటు రూపంలో ఎమ్మెల్యే పదవి కోల్పోయిన నేతలు కావడంతో, ఈ స్థానాల్లో అవసరం అయితే, ఎంతైనా ఖర్చయినా పెట్టి, వారిని మళ్లీ అసెంబ్లీలోకి పంపించే రీతిలో వ్యూహాలు సాగిస్తున్నట్టు ఆపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక తమిళనాడులో పాగా వేసేందుకు సిద్ధమైన మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో కలిసి పనిచేసేందుకు దినకరన్ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ‌కాగా ఏప్రిల్‌​ 6న రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలకు నిర్వహణకై కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ క్రమంలో డీఎంకే కూటమిలో భాగంగా 234 స్థానాల్లో డీఎంకే –174, కాంగ్రెస్‌–25, సీపీఎం –6, సీపీఐ–6, వీసీకే –6, ఎండీఎంకే –6, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌కు –3,  మనిదనేయ మక్క ల్‌ కట్చికి –2, కొంగు మక్కల్‌ దేశీయ కట్చికి –3 తమిళర్‌ వాల్వురిమై కట్చికి ఒకటి చొప్పున సీట్లు కేటాయించారు. అయితే అధికార అన్నాడీఎంకేలో మాత్రం ఇంకా సీట్ల పంచాయతి తేలలేదు.
చదవండి: కాంగ్రెస్‌కు 25.. మరి బీజేపీకి ఎన్ని సీట్లు!? 

మరిన్ని వార్తలు