ఎంపీ అరవింద్‌ను దంచుడు స్టార్ట్‌ చేస్తే..

18 Jan, 2021 17:08 IST|Sakshi

కాంగ్రెస్‌, బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌, బీజేపీ నేతలు స్టువర్ట్ పురం దొంగలు.. వారంతా గాడ్సే వారసులంటూ టీఆర్‌ఎస్‌ ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘బండి సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావ్‌.. మా నేతలంతా కలిసి తిడితే నువ్వు ఏ గ్రామంలో తిరగలేవు. మా సీఎం ఆదేశిస్తే.. మేము తిట్టడం స్టార్ట్ చేస్తే నువ్వు తట్టుకోలేవు. బాండ్ పేపర్ మీద పసుపు బోర్డు గురించి రాసిచ్చిన ధర్మపురి అరవింద్.. ఇప్పటికి తీసుకురాలేదు. కిషన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా హైదరాబాద్‌కి తీసుకురాలేదు’ అన్నారు. (చదవండి: 'కూకట్‌పల్లిలో బండి సంజయ్‌కు వ్యాక్సిన్‌ వేశా')

‘వలస కార్మికులను ప్రధాని నరేంద్ర మోదీ ఫుట్ బాల్ ఆడుకున్నారు. నల్లధనం తీసుకొస్తా అని చెప్పి ఇప్పటికి తేలేదు. గుజరాత్ వాళ్లకు మాత్రమే పదవులు ఇస్తారు. దేశ దొంగలు మొత్తం గుజరాత్ నుంచే ఉన్నారు. మోదీ ఒంటి మీద ఉన్న వస్తువులు, కార్లు అన్ని విదేశాలవే. కానీ ఆయన మాత్రం మేక్‌ ఇన్‌ ఇండియా అంటారు. రైతులతో పెట్టుకున్నోడు ఈ దేశంలో ఎవడు బాగు పడలేదు. తరుణ్ చుగ్ నీ రాష్ట్ర రైతుల సంగతి చూసుకో. మేము దంచుడు స్టార్ట్ చేస్తే అరవింద్ బోధన్ నుంచి కోరుట్ల పోలేడు.. బండి సంజయ్ కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కి రాలేడు’ అంటూ జీవన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ నేటితరం గాంధీ అని కొనియాడారు. 

మరిన్ని వార్తలు