నిరుద్యోగులకు కేజ్రీవాల్ బంపర్ ఆఫర్‌.. నెలకు రూ.3000

7 Aug, 2022 13:30 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే అందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. అహ్మదాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఆయన ఈమేరకు తెలిపారు.

గుజరాత్‌లోని కో-ఆపరేటివ్‌ రంగంలో ఉద్యోగాలన్నీ సన్నిహితులు, బంధువులకే ఇస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్‌ను గెలిపిస్తే అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. పేపర్‌ లీక్‌లు జరగకుండా చట్టాన్ని తీసుకొస్తామన్నారు.

ఢిల్లీలో అధికారం చేపట్టిన కొన్ని సంవత్సరాల్లోనే 12 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు కేజ్రీవాల్ వివరించారు. ఇటీవలే అధికారంలోకి వచ్చిన పంజాబ్‌లో 25 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ఆ సంఖ్య 51 లక్షలకు పెరుగుతుందన్నారు. గుజరాత్‌లో కూడా 24 గంటలు నిర్విరామంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూస్తామన్నారు.
చదవండి: యూపీ మంత్రికి షాక్‌.. అక్రమ ఆయుధాల కేసులో దోషిగా తేల్చిన కోర్టు..

మరిన్ని వార్తలు