Narayan Rane: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ‘వచ్చే మార్చి నాటికి బీజేపీ చేతికి అధికారం’

26 Nov, 2021 18:49 IST|Sakshi
కేంద్రం మంత్రి నారాయణ్‌ రాణె (ఫైల్‌ ఫోటో)

సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్‌ రానే

Narayan Rane BJP Government In Maharashtra By March: బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో మహారాష్ట్రలో త్వరలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని.. వచ్చే ఏడాది నాటికి మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఓ కేంద్ర మంత్రి బాంబు పేల్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మహారాష్ట్రలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణె శుక్రవారం రాజస్తాన్‌ జైపూర్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘మహారాష్ట్రలో 2022, మార్చి నాటికి బీజేపీ అధికారంలోకి వస్తుంది. త్వరలోనే మీరు భారీ మార్పులు చూడబోతున్నారు. అధికారంలోకి రావడం.. ప్రభుత్వాన్ని కూల్చడం ఇవ్వన్ని రహస్యంగా జరిగే పనులు’’ అన్నారు నారాయణ్‌ రాణె. 
(చదవండి: ‘ముందు జైల్లో పెట్టేది తిను.. నీ వల్ల కాకపోతే అప్పుడు చూద్దాం’)

2019 అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. 2019కి ముందు మిత్రపక్షం శివసేనతో కలిసి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది. కానీ 2019 ఎన్నికల ఫలితాల తర్వాత సమీకరణాలు మారాయి. శివసేన, కాంగ్రెస్‌ పార్టీ, నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీలు కలిసి మహా వికాస్‌ అఘాడి(ఎంవీఏ) పేరుతో కూటమిగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
(చదవండి: పెట్రో ధరల తగ్గింపు: శరద్‌పవార్‌ స్పందన)

పదవిలోకి వచ్చిన ప్రారంభంలో.. సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండదని.. చీలికలు చోటు చేసుకుని.. బీజేపీ చేతికి తిరిగి అధికారం దక్కుతుందని విశ్లేషకులు భావించారు. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ.. ఎంవీఏ రెండేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 

చదవండి: మహారాష్ట్రలో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ..

మరిన్ని వార్తలు