సస్పెన్స్‌ ఓవర్‌.. కేసీఆర్‌ను కలిసిన చెన్నమనేని

30 Aug, 2023 17:03 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్: తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో టికెట్ల పంచాయితీ పీక్‌ స్టేజ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. పలువురు సిట్టింగ్‌లకు టికెట్‌ దక్కకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, రంగంలోకి దిగిన కేసీఆర్‌.. పలువురు నేతలకు కీలక పదవులు, బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఈ క్రమంలోనే వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు(వ్యవసాయ రంగ వ్యవహారాలు)గా నియమించిన విషయం తెలిసిందే. 

అయితే, తాజాగా సీఎం కేసీఆర్‌ను చెన్నమనేని ప్రగతిభవన్‌లో కలిశారు. తనను వ్యవసాయ రంగ ప్రధాన సలహాదారుగా నియమించినందుకు కేసీఆర్‌ను చెన్నమనేని బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్‌ బాబు మాట్లాడుతూ.. ఆరు ద‌శాబ్దాల నుంచి వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, కేవలం దశాబ్ది కాలంలోపే అధిగమించిందని తెలిపారు. 

చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహిస్తా..
సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ రాష్ట్రం నేడు వ్యవసాయ విధానాల అమలులో, వ్యవసాయాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కేసీఆర్ సారథ్యంలో వ్యవసాయ అభివృద్ధి, రెండవ దశలో భవిష్యత్తు సవాళ్లకు సిద్దమౌతున్న సమయంలో సీఎం తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ఎమ్మెల్యే రమేశ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చెన్నమనేనికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఇక, కేసీఆర్‌తో భేటీ తర్వాత వేములవాడ బీఆర్‌ఎస్‌ రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ఒకింత ‍బ్రేక్‌ పడే అవకాశం కనిపిస్తోంది. చెన్నమనేని ఏం చెబుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. 

ఇది కూడా చదవండి: ఎన్నికలకు ఇంకా మూడు నెలలుంది.. ఎమ్మెల్యే రాజయ్య షాకింగ్‌ కామెంట్స్‌

మరిన్ని వార్తలు