అమరావతి: గడప గడపకు కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్కరణలు, సంక్షేమం సాగుతోందని, రానున్న ఎన్నికలకలో ప్రజలు మళ్లీ వైఎస్సార్సీపీనే కోరుకుంటున్నారన్నారు. అదే సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ‘మాకు మూడు ఆప్షన్లు’ అంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు.
పవన్ కల్యాణ్ అందుకున్న రాగానికి చంద్రబాబు ట్యూన్ కట్టారన్నారు. అయితే పొత్తులపై మాట్లాడే అవసరం తమకు లేదని సజ్జల తేల్చి చెప్పారు. ‘పొత్తులపై మాట్లాడే అవసరం మాకేంటి. పొత్తులపై మాకు విశ్వాసం లేదు. మీరు సింగిల్గా వచ్చినా, పొత్తులతో వచ్చినా అభ్యంతరం లేదు. మాకు ప్రజలపై నమ్మకం ఉంది. ప్రజల ఎజెండాతో ముందుకెళ్తున్నాం. రెండేళ్లు సమయం ఉన్నా, పొత్తులపై వారే మాట్లాడుకుంటున్నారు.రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు మూడు ఆప్షన్లు అంటున్నారు. పవన్ కల్యాణ్ ఆప్షన్-1 సొంతంగా అధికారంలోకి రావడం అన్నారు. సొంతంగా అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉంటే మిగతా ఆప్షన్లు ఎందుకు?’ అని సజ్జల ప్రశ్నించారు.