సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ దోషి అని సుప్రీంకోర్టే తేల్చిందన్నారు. సుప్రీంకోర్టులో కేసు కొట్టేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ వేయగా..వీళ్లు దోషులే అని న్యాయస్థానం చెప్పిందన్నారు. ఆయనపై కేసు కొట్టేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.
అన్ని పార్టీల్లో దొంగలుంటారని.. కానీ దొంగలు ముఖ్యమంత్రి కాకూడదని షర్మిల పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో దొంగలకు ఓటు వేయొద్దని సూచించారు. రేవంత్ రెడ్డిని.. రేటెంతరెడ్డి అంటున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజల కోసమే తెలంగాణ ఎన్నికల్లో పాల్గొనకుండా ఉన్నామని ఆమె స్పష్టం చేశారు. ఏ పదవి కోసమే.. ఎవరో తమకు కిరీటాలు పెట్టాలని కోరుకోవడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు పార్టీకి ఓటు వేయవద్దని, తెలంగాణలో ప్రభుత్వం మారాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.