ఏ సర్కారూ పరీక్షలే పెట్టనట్లు కమిషన్‌ కాకమ్మ కథలు

30 Sep, 2023 03:28 IST|Sakshi

ఎక్స్‌(ట్విట్టర్‌)లో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటిదాకా ఏ సర్కారూ పరీక్షలే పెట్టనట్లు.. ఎవరూ ఉద్యోగాలే ఇవ్వనట్లు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) కాకమ్మ కథలు చెబుతోందని శుక్రవారం ఎక్స్‌(ట్విట్టర్‌) వేదికగా వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. నచ్చినోళ్లకు పదవులు, కావాల్సినోళ్లకు ఉద్యోగాలు.. ఇదే దొర తెచ్చిన బంగారు తెలంగాణ అని విమర్శించారు.

చెప్పాలంటే తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ను కాస్త.. దొరలు ప్రగతిభవన్‌ సర్విస్‌ కమిషన్‌ గా మార్చారన్నారు. ‘గ్రూప్‌ 1 పరీక్షలు ఎంత మంది రాశారో ముందొక లెక్క.. ఓఎంఆర్‌ షీట్స్‌ లెక్కిస్తే మరో లెక్క.. ఇది చాలా కామన్‌ అట. ప్రశ్నపత్రాలనే అంగట్లో సరుకుల్లా అమ్ముకున్నోళ్లకు ఓఎంఆర్‌ షీట్స్‌ తారుమారుచేయడం ఒక లెక్కనా’అని అన్నారు. బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తే కమిషన్‌కు వచ్చిన నష్టం ఏంటని షర్మిల సూటిగా ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు