కోడ్‌ ఉల్లంఘించిన బాబుపై చర్యలు తీసుకోండి

6 Feb, 2021 04:24 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు

ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు వి.మనోహర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ పంచాయతీ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేశారని దుయ్యబట్టారు.

యథేచ్చగా కోడ్‌ను ఉల్లంఘించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని గత నెల 29న ఫిర్యాదు చేశామని చెప్పారు. కానీ తీరిగ్గా 6 రోజుల తర్వాత టీడీపీ మేనిఫెస్టోను ఉపసంహరించుకోవాలంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఉత్తర్వులివ్వడం హాస్యాస్పదమన్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వంపై గవర్నర్‌కు లేఖలు రాసిన నిమ్మగడ్డ.. బాబు విషయంలో మాత్రం ఎందుకు చూసీచూడనట్లు ఉంటున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పక్షపాత ధోరణి విడిచిపెట్టి.. బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు