ఓట్ల నమోదులో టీడీపీ అవకతవకలు.. ఈసీకి వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు

23 Dec, 2023 18:55 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర సంఘం ప్రతినిధులను వైఎస్సార్‌సీపీ నేతలు కలిశారు. ఈసీ ప్రతినిధులను జోగి రమేష్‌, పేర్ని నాని, కొఠారు అబ్బయ్య చౌదరి కలిశారు. ఈ సందర్బంగా ఓట్ల నమోదులో టీడీపీ చేస్తున్న అవకతవకలపై ఈసీ బృందానికి ఫిర్యాదు చేశారు. 

అనంతరం, మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో ఓట్ల నమోదులో టీడీపీ చేస్తున్న అవకతవకలపై ఫిర్యాదు చేశాం. తెలంగాణలో ఓట్లు ఉన్న వాళ్ళకి ఇక్కడ తొలగించాలని కోరాం. అక్కడ ఓటు హక్కు వినియోగించి మళ్ళీ ఇక్కడ ఓటు నమోదుకు టీడీపీ ప్రయత్నం చేస్తోంది. డబుల్ ఎంట్రీ క్రిమినల్ చర్య. దీని కోసం హైదరాబాద్‌లో టీడీపీ క్యాంపెయిన్ చేస్తోంది. దానిపై ఫిర్యాదు చేశాం.

రాష్ట్ర యంత్రాంగం మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలు మానేసి ఎన్నికల ఫిర్యాదుల్లోనే ఉండాలని టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేస్తోంది. కోనేరు సురేష్ అనే వ్యక్తి ఈ తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరాం. కోనేరు సురేష్ తప్పుడు ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆశ్చార్యపోయారు. మై పార్టీ డ్యాష్ బోర్డ్ అనే యాప్‌లో ఓటర్ లిస్టులో ఫోటోలు, అడ్రస్‌, కులం అన్ని వివరాలు ఉన్నాయి. దానిపై చర్యలు తీసుకోవాలని కోరాం. టీడీపీ సేకరిస్తున్న వ్యక్తిగత సమాచారం వ్యవహారంపై ఫిర్యాదు చేశాం. 

టీడీపీ-జనసేన కలిసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని ఫిర్యాదు చేశాం. మేనిఫెస్టో రూపంలో కాకుండా వ్యక్తిగతంగా ఇంటింటికెళ్లి ప్రలోభాలకు గురి చేస్తుందని ఫిర్యాదు ఇచ్చాం. టీడీపీ మేనిఫెస్టో ప్రచారంతో చంద్రబాబు సంతకంతో లెటర్లు ఇస్తున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. 2019లో ఓటర్ జాబితాలో ఉన్న ఓట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఫేక్‌ ఓట్లను నిరూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దొంగే దొంగ అన్నట్లు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు’ అని సైటెర్లు వేశారు. 

>
మరిన్ని వార్తలు