ఒంగోలు టౌన్: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం జనవరి 6వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మీడియా సంస్థల్లో పనిచేస్తూ అక్రిడిటేషన్ కలిగిన అర్హులైన జర్నలిస్టులకు హౌసింగ్ స్కీం కింద స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని తెలిపారు. నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డు పొందిన జర్నలిస్టుల వివరాలు, వృత్తి అనుభవాన్ని విజయవాడలోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం పరిశీలించిన అనంతరం ప్రాథమికంగా ధ్రువీకరించామన్నారు. ఇప్పటి వరకు 136 మంది అర్హులైన జర్నలిస్టుల వివరాలను జిల్లాకు పంపించినట్లు వివరించారు. తదుపరి దశలో వీటిని జిల్లా ఇన్చార్జి మంత్రి చైర్మన్గా వ్యవహరించే కమిటీ పరిశీలించి అవసరమైన వెరిఫికేషన్ అనంతరం అర్హులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయనున్నట్లు తెలిపారు.