ఒంగోలు: ఈనెల 26న తంగాట మార్షల్ ఆర్ట్స్ క్రీడాజట్ల ఎంపిక యద్దనపూడి మండలం పూనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కె.వనజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని అండర్– 14 అండర్– 17 బాల బాలికల జట్ల ఎంపిక నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9 గంటలకు ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. పీఈటీలు/ పీడీలు ఆసక్తి కలిగిన విద్యార్థులతో ఆన్లైన్ ఎంట్రీ చేయించి మాన్యువల్ ఎంట్రీఫారంతో ఎంపికకు హాజరుకావాలని చెప్పారు. అండర్ 17 కేటగిరీలో పాల్గొనే ఇంటర్ విద్యార్థులు పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, జ్ఞానభూమి చైల్డ్ ఐడీ నెంబర్, సంబంధిత ప్రిన్సిపాల్ ధ్రువీకరణతో నిర్వాహకులకు సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు టి.అంకరాజు, సెల్ నెంబర్ 9493923121ను సంప్రదించాలని ఈ సందర్భంగా తెలిపారు.
చికిత్స పొందుతూ
భార్యభర్తలు మృతి
టంగుటూరు: ఈ నెల 18న పొందూరు ఎస్సీ కాలనీలో గ్యాస్ సిలిండ్ పేలడంతో ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన విదితమే. కాగా చికిత్స పొందుతూ భార్య భర్తలు శనివారం మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పొందూరు ఎస్సీ కాలనీకి చెందిన గొర్రెముచ్చు బాలకోటయ్య, భార్య ఈశ్వరమ్మ గ్యాస్ పొయ్యి పాడవ్వడంతో మరమ్మతులు చేస్తుండగా ప్రమాదంలో జరిగింది. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలు జీజీహెచ్కు అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఈశ్వరమ్మ (20) ఈ నెల 20న మృతి చెందగా పంచనామా అనంతరం గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. భార్య మరణించిన వార్త విన్న బాలకోటయ్య (69) శనివారం మృతి చెందాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరమ్మతులు చేసిన వ్యక్తి అంజయ్య ఒంగోలు ప్రైవేటు ఆసుపత్రికిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
గ్యాస్ ట్యాంకర్ను ఢీకొన్న టిప్పర్
టంగుటూరు: టిప్పర్ డ్రైవర్ నిద్రమత్తులో ఆగి ఉన్న గ్యాస్ ట్యాంకర్ను వెనుక నుంచి ఢీకొట్టగా టిప్పర్ డ్రైవర్ లారీలో ఇరుక్కుపోయిన సంఘటన స్థానిక టోల్ ప్లాజా సమీపంలో శనివారం చోటు చేసుకుంది. జాతీయ రహదారి పోలీసులు వివరాల మేరకు.. ఒంగోలు నుంచి నెల్లూరు వైపు టిప్పర్ బయలుదేరింది. మార్గ మధ్యంలో టోల్ ప్లాజా సమీపంలో పక్కన్న ఆగి ఉన్న గ్యాస్ ట్యాంకర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో టిప్పర్ లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. తీవ్రగాయాలైన డ్రైవర్ పెరమాల నాగలక్ష్మయ్యను ఫైర్ పోలీసు, జాతీయ రహదారి పోలీసులు అతి కష్టం మీద బయటకు తీసి చికిత్స నిమిత్తం అంబులెన్సులో జీజీహెచ్కు తరలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఇన్చార్జి ఎస్సై శ్రీరామ్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
జబరాజంగి లఘు చిత్రం షూటింగ్ ప్రారంభం
ఒంగోలు టౌన్: ఎన్నో ప్రతిష్టాత్మకమైన లఘు చిత్రాలను నిర్మించిన సుహారి ఎంటర్టైన్మెంట్స్ ఓటీటీ వేదికగా చేసుకొని ప్రయోగాత్మకంగా జబరాజంగి చిత్రానికి శ్రీకారం చుట్టింది. శనివారం ఈ చిత్రానికి ఒంగోలులోని రామాలయంలో క్లాప్ కొట్టి ప్రారంభించారు. పూజా కార్యక్రమాలను నిర్వహించిన రవి శంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ కెమరా స్విచాన్ చేశారు. జిల్లా నీటి యాజమాన్యం సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ శీనారెడ్డి క్లాప్ కొట్టారు. సాధనాల సురేష్బాబు కథా నాయకుడిగా అనూష కథానాయకిగా, దాసరి శ్రీనివాస్ భార్గవ్ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుహారి ఎంటర్టైన్మెంట్ పతాకంపై పిన్నింటి నాయుడు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బండారు రవితేజ దర్శకత్వం వహిస్తున్నారు. కలిలోకంలో కర్ణుడి కథ కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు దర్శకుడు రవితేజ తెలిపారు.