నిర్ణయం మార్చుకోనంటున్న మిస్టర్‌ 360 

18 May, 2021 19:12 IST|Sakshi

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా వెటరన్‌ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌.. రిటైర్మెంట్‌పై తన నిర్ణయం మార్చుకునేది లేదని తేల్చి చెప్పాడు. భారత్‌ వేదికగా అక్టోబర్‌లో జరుగబోయే టీ20 ప్రపంచకప్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తాడని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో ఈ మిస్టర్‌ 360 ఆటగాడి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉండింది. అయితే అభిమానుల ఆశలను పటాపంచలు చేస్తూ తన నిర్ణయాన్ని వెనక్కు తీసకునేదే లేదంటూ ఏబీ స్పష్టతనిచ్చాడు. 

2018లో అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన తరువాత చాలా సందర్భాల్లో ఏబీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తాడని పుకార్లు షికార్లు చేశాయి. ఇదే అంశంపై ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు దక్షిణాఫ్రికా హెడ్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్‌  ఏబీని సంప్రదించగా, ఐపీఎల్‌ ముగిసాక తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పడంతో అభిమానుల ఆశలు సజీవంగా నిలిచాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల ఆశలను అడియాశలు చేస్తూ..  తన రిటైర్మెంట్‌ నిర్ణయంపై తగ్గేదే లేదంటూ కుండబద్దలు కొట్టాడు. 

ఈ ఏడాది ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన ఏబీ.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసి మరింతగా అలరిస్తాడని భావించిన ఫ్యాన్స్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. భారత్‌లో కరోనా ఉద్ధృతి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ అర్ధంతరంగా రద్దు కావడంతో స్వదేశానికి వెళ్లిన ఏబీడిని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు సంప్రదించినప్పటికీ, తన నిర్ణయంలో ఏ మార్పు లేదని, ఉండదని తేల్చేశాడు. దీంతో అతనిపైనే గంపెడాశలు పెట్టుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డులో నైరాశ్యం ఆవహించింది. 
చదవండి: నేను రెడీగా ఉన్నా, కాల్‌​ రావడమే ఆలస్యం: నితీష్‌ రాణా

>
మరిన్ని వార్తలు