Rishabh Pant: ఎంఆర్‌ఐ స్కానింగ్‌ కూడా చేయలేనంత తీవ్రంగా గాయాలు.. బీసీసీఐకి బింద్రా సలహా

5 Jan, 2023 14:31 IST|Sakshi

Abhinav Bindra Tweet On Rishabh Pant: కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన భారత క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కు మరింత మెరుగైన చికిత్స అవసరమని బీసీసీఐ భావించింది. దాంతో ఇప్పటి వరకు చికిత్స పొందుతున్న డెహ్రాడూన్‌ ఆస్పత్రి నుంచి పంత్‌ను ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా ముంబైకి తరలించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో.. ఇకపై ముంబైలోని ప్రతిష్టాత్మక కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ హాస్పిటల్‌లో పంత్‌కు చికిత్స కొనసాగుతుందని బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. ప్రధానంగా పంత్‌ మోకాలి గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటం, వాటికి తక్షణ చికిత్స అవసరం కావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

గతంలో సచిన్, యువరాజ్, బుమ్రా
స్పోర్ట్స్‌ మెడిసిన్‌ హెడ్, ఆర్థోస్కోపీ నిపుణుడైన డాక్టర్‌ దిన్షా పర్దీవాలా పంత్‌ చికిత్సను పర్యవేక్షిస్తారు. దిన్షా గతంలో సచిన్, యువరాజ్, బుమ్రా, జడేజాలతో పాటు పలువురు ఇతర అథ్లెట్లకు చికిత్స అందించారు. పంత్‌ కోలుకునేందుకు బోర్డు అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని షా చెప్పారు. 

తీవ్రత ఎంతగా ఉందంటే
అయితే, ప్రస్తుతం పంత్‌ ఆరోగ్యం నిలకడగానే ఉన్నా... అతని మోకాలు, మడమ గాయాల తీవ్రత ఎంతగా ఉందంటే ఇప్పటి వరకు వాటికి కనీసం ఎంఆర్‌ఐ స్కానింగ్‌ కూడా చేయలేకపోయారు. ఇదే కాస్త ఆందోళన కలిగించే అంశం. 

ఇదిలా ఉంటే.. రిషభ్‌ పంత్‌ పట్ల బీసీసీఐ తీసుకుంటున్న శ్రద్ధ పట్ల ఒలంపిక్‌ స్వర్ణ పతక విజేత అభినవ్‌ బింద్రా హర్షం వ్యక్తం చేశాడు. ‘‘రిషభ్‌ త్వరగా కోలుకునేందుకు బోర్డు చేస్తున్న ప్రయత్నాలు అద్భుతం.

అయితే, ఈ కష్టకాలంలో అతడికి మానసికంగా మద్దతు కూడా అవసరం. తనకు భరోసా కల్పించేలా మరిన్ని చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది’’ అని బింద్రా ట్విటర్‌ వేదికగా బీసీసీఐకి సలహా ఇచ్చాడు.

కాగా భారత షూటర్‌ అభినవ్‌ బింద్రా బీజింగ్‌ ఒలంపిక్స్‌లో దేశానికి పసిడి పతకం అందించిన విషయం తెలిసిందే. తద్వారా ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా బింద్రా చరిత్ర సృష్టించాడు. 

చదవండి: Sanju Samson: మరీ ఇంత దరిద్రం ఏంటి భయ్యా! ఇలాగైతే ‘కెరీర్‌’కు ఎండ్‌ కార్డ్‌ పడ్డట్లే!
Ind Vs SL- Jitesh Sharma: ఎవరీ జితేశ్‌ శర్మ? సంజూ స్థానంలో అతడే ఎందుకు? బీసీసీఐ ఆలోచన అదేనా?!

మరిన్ని వార్తలు